కల్కి భగవాన్ చంద్రబాబు చుట్టమా?
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం సమీపంలోని కల్కి ఆశ్రమం పేరుతో వందలాది ఎకరాలు వరదయ్యపాళెం, సత్యవేడు, బీఎన్. కండ్రిగ మండలాల్లో ఉన్నట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. కొంతకాలంగా కల్కి ఆశ్రమం భూములపై వివాదాలు రావడంతో కలెక్టర్ శేషాద్రి కల్కి ఆశ్రమానికి సంబంధించి పూర్తి భూముల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కోరారు. ఈ మేరకు ఆయా మండలాల తహసీల్దార్ల నుంచి పూర్తి వివరాలను సేకరించి ఆర్డీవో అసపు ప్రసాద్ ఓ సమగ్ర నివేదికను జేసీ సురేష్కుమార్కు గురువారం సమర్పిం చారు. కల్కి ఆశ్రమానికి సంబంధించిన భూము ల వివరాలు ఇలా ఉన్నాయి.
వరదయ్యపాళెం మండలంలోని కురింజలం గ్రామంలో 10.30 ఎకరాలు, కంబాకంలో 153.02 ఎకరాలు, చెదుల పాకంలో 170. 14, బీఎన్.కండ్రిగ మండలంలోని నీర్పాకోటలో 19.14, కల్లివేట్టులో 189.99, తలారివెట్టులో 119.79, సత్యవేడు మండలంలోని పీవీ పురంలో 46.66 ఎకరాల భూములను ఇతరుల నుంచి కొనుగోలు చేసినవి ఉన్నాయి.
సత్యవేడు మండలంలో ప్రభుత్వం అర్హులైన పేదలకు 61 ఎకరాల 41 సెంట్ల డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది. వాటి ని కల్కి ఆశ్రమం నిర్వాహకులు కొనుగోలు చేశా రు. అయితే వాటిని ప్రభుత్వం స్వాధీనపరచుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 60 మందికి 2004లో పట్టాలు ఇచ్చింది. అలాగే వరదయ్య పాళెం మండలంలో కల్కి ఆశ్రమం కొనుగోలు చేసిన 14 ఎకరాల డీకేటీ భూములను రెవెన్యూ అధికారులు రద్దు చేసి 14 మంది అర్హులైన పేదలకు పంపిణీ చేశారు. మరో 60 ఎకరాల 30 సెంట్ల డీకేటీ భూమిని కల్కి ఆశ్రమం కొనుగోలు చేయడంపై 2005 నుంచి తిరుపతి కోర్టు, హైకోర్టులలో కేసు నడుస్తున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది.