కెసిఆర్ కొత్త కుంపటి

నిజానికి, కెసిఆర్ మాటల్లో ఏ విధమైన తప్పూ కనిపించదు. కానీ, లోతుల్లోకి వెళ్లి చూస్తే అది కెసిఆర్ మాటల్లోని తప్పు ఏమిటో అర్థమవుతుందని తెలంగాణవాదులు అంటున్నారు. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కి, వివిధ ఒప్పందాలను ఉల్లంఘించి పలు రకాల్లో దొడ్డి దారుల్లో వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ స్థిరపడిపోయారు. వారికి పుట్టి పెరిగిన పిల్లలు పెద్దవారయ్యారు. ఈ పిల్లలను స్థానికులుగా గుర్తిస్తే తెలంగాణ స్థానికులకు అన్యాయం జరుగుతుందని, అక్రమాలను సక్రమం చేసినట్టవుతుందని తెలంగాణ ప్రజా సంఘాల అభిప్రాయం. పాత ఉల్లంఘనలను తిరిగిదోడి, విచారణ జరిపించి స్థానికేతరులుగా గుర్తించాలని, వారిని స్థానికేతరులుగానే పరిగణించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
తెలంగాణ న్యాయవాదుల జెఎసి వాదనతో విభేదిస్తూ కెసిఆర్ ఆ ప్రకటన చేశారు. కెసిఆర్ తన ప్రకటన ద్వారా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారనేది వారి అభియోగంగా కనిపిస్తోంది. కెసిఆర్ ప్రకటనపై కోదండరామ్ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. కెసిఆర్ ను వ్యతిరేకించలేక, సమర్థించనూ లేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. దానిపై కెసిఆర్ వివరణ అడుగుతానని ఆయన చెప్పారు. అయితే, కెసిఆర్ ప్రటనతో నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద కెసిఆర్ మరో కొత్త కుంపటి నెత్తికెత్తుకున్నారు. దీన్ని ఆయన ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications