జగన్ రాజప్రసాదాల గొడవ
టీవీ9 ప్రతినిధిపైనే కాకుండా కన్నడ మహిళా జర్నలిస్టుపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. ఇతర జర్నలిస్టులను ఆ దరికి కూడా రానీయలేదు. బెంగళూర్ శివారులోని వైయస్ జగన్ ప్రసాదం అమెరికా అధ్యక్షుడి శ్వేతసౌధాన్ని మించిన హంగులతో, ఆర్భాటాలతో ఉందని స్టూడియో ఎన్ వ్యాఖ్యానించింది. వైయస్ జగన్ నివాసానికి మూండంచెల సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ 200 మంది ఉన్నారు. మూడు షిఫ్టుల్లో వారు పనిచేస్తారు. విశాలమైన స్థలంలో ఇండోర్ స్టేడియం వంటి పలు సౌకర్యాలు, ఆధునిక హంగులు ఉన్నాయి.
హైదరాబాదులోని జూబిలీహిల్స్ లోనూ జగన్ అదే తరహా భవనం నిర్మిస్తున్నారు. లోటస్ పాండ్ వ్యూ పాయింట్ పై అది ఉంది. అక్కడి నుంచి చూస్తే నగరంలోని పలు దిక్కులూ కనిపిస్తాయి. ఈ భవనం ఆవరణలోకి వెళ్లడానికి ఒకే దారి ఉంది. అంతకు మించి చీమ కూడా దూరడానికి వీలు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కడప జిల్లా పులివెందులలోనూ ఓ మహలు ఉంది. పెద్ద ఎస్టేట్ ఉంది. వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎస్టేట్ విస్తరించి ఉంది. ఈ విషయాలను స్టూడియో ఎన్ వెల్లడించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
స్టూడియో ఎన్ పైనే కాకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కూడా జగన్ వర్గం దుమ్మెత్తి పోస్తోంది. జర్నలిస్టులపై దాడిని కూడా జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు సమర్థించుకున్నారు. ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నిస్తే అడ్డుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ టీవీ చానెల్ లో చంద్రబాబు దొంగ పెట్టుబడులు పెట్టారని, అందువల్లనే జగన్ ఆస్తులపై అది ప్రచారానికి దిగిందని ఆయన తన అక్కసు వెళ్లగక్కారు. నిజానికి, స్టూడియో ఎన్ చంద్రబాబు సమీప బంధువుది. దాన్ని విస్తరించడానికి, ప్రజామోదం రాబట్టడానికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారనే మాట ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది.
ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప అంటూ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలను మభ్య పెట్టారని, తన కుమారుడు వైయస్ జగన్ కు మాత్రం వివిధ రూపాల్లో ఆస్తులు సమకూర్చుకునేందుకు వీలు కల్పించారని స్టూడియో ఎన్ వ్యాఖ్యానించింది. ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితిపై, రాజీవ్ గృహకల్ప పథకం మూలన పడడంపై ఆ చానెల్ తీవ్ర విమర్శలు చేసింది. వైయస్ జగన్ అంత పెద్ద మొత్తంలో అతి కొద్ది కాలంలో ఆస్తులు సమకూర్చుకోవడంలోని మతలబు ఏమిటనే ప్రశ్నను స్టూడియో ఎన్ సంధించింది.