ఇక వైయస్ జగన్ వర్గం ఫైట్
నెల్లూరు జిల్లాలో గోపాల్ రెడ్డిని పక్కన పెట్టి, వ్యవహారాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పిసిసి అప్పగించింది. దీనిపై గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. వైయస్ జగన్ ది వ్యక్తిగత యాత్ర అని, అందువల్ల తాను పాల్గొన్నానని ఆయన చెప్పారు. వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పిసిసి సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. అలాగే, ప్రతాపరెడ్డి కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జగన్ వర్గానికి సంబంధించి ఇప్పటికి ఓ స్పష్టత వచ్చినట్లు భావిస్తున్నారు. కొండా సురేఖ, అంబటి రాంబాబు వంటి అందరినీ కాంగ్రెసు దూరంగా పెట్టాలనే నిర్ణయానికే వచ్చినట్లు కనిపిస్తుంది. దీనిపై జగన్ వర్గం కూడా ఓ స్పష్టతకు వచ్చి, తిరుగుబాటు తప్ప మరో మార్గం లేదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అంబటి రాంబాబు మాత్రమే ఎక్కువగా పార్టీ నాయకత్వంపై, ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ అప్పుడప్పుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ వర్గం కలిసికట్టుగా విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.