జగన్ ఆపరేషన్ - 2

ప్రస్తుతం తెలంగాణ మంత్రులను దారికి తెచ్చుకోవడంలో అధిష్టానం విజయం సాధించింది. కోస్తా మంత్రులతో చర్చలు జరుగుతున్నాయి. వట్టి వసంత కుమార్ మాట వినకుండా వెళ్లిపోయినా ఫరవా లేదనే ధోరణితోనే పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం కూర్పులోనే వైయస్ జగన్ ఆపరేషన్ -2కు శ్రీకారం చుట్టిన అధిష్టానం దాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధపడింది. కడప జిల్లాలోనే వైయస్ జగన్ కు కుంపటి రాజేసే ప్రయత్నాన్ని ప్రారంభించింది. పది శాసనసభా స్థానాలున్న కడప జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు మంత్రులను తీసుకున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డికి, అహ్మదుల్లాలకే కాకుండా వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చింది. ఈ ముగ్గురు కూడా వైయస్ జగన్ ప్రాతినిధ్యం వహించిన కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోని వారే కావడం విశేషం. డిఎల్ రవీంద్రా రెడ్డి ఒకప్పుడు వైయస్సార్ కు అనుంగు మిత్రుడు. వైయస్సార్ ముఖ్యమంత్రి ఆయిన తర్వాత ఆయనను దూరం చేసుకున్నారు. అహ్మదుల్లా కూడా వైయస్సార్ కు విధేయుడే. ఆయన వైయస్ జగన్ వెళ్లకుండా కాంగ్రెసు అధిష్టానం జాగ్రత్త పడింది.
మరోవైపు, ఏకంగా వైయస్ జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి వైయస్సార్ కుటుంబంలో చీలిక తెచ్చింది. పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఏర్పడే పరిస్థితిని కల్పించింది. అంతేకాకుండా సోనియా గాంధీ వైయస్ వివేకానంద రెడ్డితో మరింత లోతుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి వైయస్ జగన్ పై వైయస్ వివేకానంద రెడ్డిని, కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ సోదరి షర్మిళపై వైయస్ వివేకానంద రెడ్డి కూతురును పోటీకి దించేందుకు కూడా నిర్ణయం జరిగిపోయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, వైయస్ జగన్ ఆపరేషన్ -2ను పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని సోనియా అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications