జగన్ పై వేలాడుతున్న కత్తి

తన పరిధిలో ఉన్న నాయకులపై పిసిసి చర్యలను ఉధృతం చేసింది. తాజాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పిసిసి కార్యదర్శి పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. తిరుపతి నగర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రతాప రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. నెల్లూరు జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు వై గోపాల్ రెడ్డికి ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డికి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శాసనసభ్యురాలు కొండా సురేఖ, పార్టీ నాయకుడు అంబటి రాంబాబులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.
ఈ స్థితిలో వైయస్ జగన్ తీవ్ర ఇరకాటంలో పడేట్లున్నారు. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర విషయంలోనే ఆయనపై తీవ్ర ప్రభావం పడింది. పార్టీ శాసనసభ్యులకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో శివరామిరెడ్డి అనే శాసనసభ్యుడు, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తప్ప మిగతా శాసనసభ్యులు ఎవరూ ఓదార్పు యాత్రలో పాల్గొనలేదు. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభం కావడానికి వ్యవధి దగ్గరపడుతున్న సమయంలో ఆ జిల్లాకు చెందిన నాయకులపై నేరుగా చర్యలకే దిగింది.
పార్టీ నాయకత్వం స్పష్టంగా ముందుకు వస్తుండడంతో జగన్ వైపు వెళ్లాలనుకునే నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ కు చాలా మద్దతు తగ్గిపోయింది. జగన్ సభలకు పెద్ద యెత్తున ప్రజలు వస్తున్నారని భావిస్తున్నప్పటికీ ఆయన యాత్ర రొటీన్ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయని, అలా మారిపోతున్న కొద్దీ జగన్ ను ఇరకాటంలో పెట్టే విధంగా చర్యలకు దిగాలని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం. జగన్ కు మద్దతిస్తున్న నాయకులపై చర్యలు తీసుకునే విషయంలో పార్టీ అధిష్టానం డిఎస్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు కూడా భావిస్తున్నారు. అందువల్ల జగన్ భవిష్యత్తు పయనం నల్లేరు మీద నడక కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications