వైయస్ జగన్ ప్లాన్ ఏమిటి?

వైయస్ జగన్ సాధ్యమైనంత త్వరలోనే పార్టీని స్థాపించే అవకాశాలున్నాయి. పార్టీ పేరు కూడా వైయస్సార్ కాంగ్రెసుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టే సమయంలో తన వర్గానికి చెందిన శానససభ్యులతో ఆయన రాజీనామాలు చేయిస్తారని అంటున్నారు. పార్టీ పెట్టేంత వరకు వారంతా కాంగ్రెసులోనే కొనసాగుతారని అంటున్నారు. మరో వ్యూహం కూడా ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించి అన్ని జిల్లాల్లో పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత శాసనసభ్యులతో రాజీనామాలు చేయించడం రెండోది. లేకుంటే, పార్టీ స్థాపించిన తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో కాంగ్రెసు శాసనసభా పక్షాన్ని చీల్చడం కూడా మరో వ్యూహం. శాసనసభా పక్షాన్ని చీల్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనేది కూడా వైయస్ జగన్ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ వైపు 70 మంది దాకా శాసనసభ్యులు వస్తారని అంటున్నారు. అంత మంది కాకపోయినా 50 మంది వచ్చినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వం మనుగడ సాగించడం సాధ్యం కాదు. ఈ స్థితిలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ పుంజుకోకుండా చూసుకునే విధంగా ఆ వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. కడప, పులివెందులతో పాటు మరిన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు వచ్చేలా వైయస్ జగన్ చూస్తారా అనేది కూడా ప్రధానమైన అంశంగానే ఉంది. ఇలా పలు వ్యూహాల్లో ఏది అనుకూలంగా ఉంటే దాన్ని అమలు చేయాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించకుండా చూడడమే ఆయన ముందున్న లక్ష్యమని అంటున్నారు. దానికితోడు ప్రభుత్వాన్ని పడగొట్టామనే పేరు తనకు రావద్దని కూడా ఆయన అనుకుంటున్నారు. వైయస్సార్ ఆశయాల నుంచి పక్కకు జరగడం వల్లనే ప్రభుత్వం కూలిపోయిందని అనిపించడం ఆయనకు కావాలి.












Click it and Unblock the Notifications