పులివెందుల నుంచి వైయస్ వివేకా?

వైయస్ జగన్ తీరు పట్ల చాలా కాలంగా వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానాన్ని వ్యతిరేకించడాన్ని ఆయన తప్పు పడుతూ వస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్ ను తన కుటుంబ పెద్దగా అప్పట్లో ప్రకటించుకున్నారు కూడా. అయితే, ఏనాడూ ఆయన వైయస్ జగన్ తీరును మనస్పూర్తిగా అంగీకరించలేదని అంటున్నారు. కడప పార్లమెంటు సీటు జగన్ వల్లనే వైయస్ వివేకానంద రెడ్డికి దక్కలేదు. 2004 ఎన్నికల తర్వాత మధ్యలో వైయస్ వివేకానంద రెడ్డిని కడప పార్లమెంటు సీటుకు రాజీనామా చేయించాలని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నించారు. ఆ స్థానంలో తన కుమారుడు వైయస్ జగన్ ను పోటీకి దించాలని అనుకున్నారు. కానీ, సోనియా గాంధీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రయత్నాన్ని వైయస్సార్ విరమించుకున్నారు.
వైయస్సార్ 2009 ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి తన కుమారుడు వైయస్ జగన్ కు కడప పార్లమెంటు సీటు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆ తర్వాత వైయస్ వివేకానంద రెడ్డిని శాసన మండలికి ఎంపిక చేయించారు. వైయస్సార్ మరణం తర్వాత పులివెందుల శాసనసభా స్థానానికి వైయస్ జగన్ పోటీ చేయడానికి ప్రయత్నించారు. అందుకు కూడా సోనియా అంగీకరించలేదు. వైయస్సార్ సతీమణి వైయస్ విజయలక్ష్మికి టికెట్ ఇచ్చింది. వైయస్ జగన్ తప్ప వైయస్సార్ కుటుంబ సభ్యులు ఎవరు పులివెందుల నుంచి పోటీ చేసినా అభ్యంతరం లేదని పార్టీ అధిష్టానం ప్రకటించింది. దాంతో వైయస్ విజయలక్ష్మి వైపు జగన్ మొగ్గు చూపారు. దాంతో ఆమె పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications