చంద్రబాబు సెల్ఫ్ గోల్
తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సమావేశాలను బహిష్కరించడంతో తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు సమైక్యవాదాన్ని అందుకుని గురువారం శాసనసభా సమావేశాలను అడ్డుకున్నారు. ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యూహంగానే చంద్రబాబు భావిస్తుండవచ్చు గానీ పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. పయ్యావుల కేశవ్ వంటి సీమాంధ్ర శాసనసభ్యులు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో తెలుగదేశంలోని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల మధ్య దూరం పెరిగిందని చెబుతున్నారు. ఈ పరిణామం ఇరు ప్రాంతాల్లో పార్టీని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పలేం. ఒక స్పష్టమైన వైఖరి లేకుండా ఎటు పడితే అటు మాట్లాడడం వల్ల చంద్రబాబు విశ్వసనీయత ప్రజల్లో సన్నగిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలావుంటే, చంద్రబాబు పార్టీ జూనియర్లను విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు. సీనియర్లకు వారిని పోటీ పెడుతున్నారు. సీమాంధ్రలో పయ్యావుల కేశవ్ వంటివారని, తెలంగాణలో రేవంత్ రెడ్డి వంటిని ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల సీనియర్లు చంద్రబాబుపై కినుకతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో సీనియర్లు పార్టీ కోసం పెద్దగా కృషి పెట్టే అవకాశాలు కూడా లేకుండా పోయాయని అంటున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పరిస్థితి చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతోంది. కాకరాపల్లి ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుతో సీనియర్ నేత కె. ఎర్రంనాయుడు లేరు. కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెంనాయుడుకు వాటాలున్నట్లు బాధితులు నమ్ముతున్నారు. దీనిపై చంద్రబాబును బాధితులు నిలదీశారు కూడా. ఈ వ్యవహారంలో ఎర్రంనాయుడు వర్గం చంద్రబాబుకు దూరమవుతున్నారనే మాట వినిపిస్తోంది.
మొత్తం మీద చంద్రబాబు వైఖరి వల్ల పార్టీ రెండు ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే కష్టాలకు, నష్టాలకు కూడా ఓర్చి కట్టుబడి ఉండేది. ఆ నమ్మకం తెలుగుదేశంపై ప్రజలకు ఉండేది. ఇప్పుడు ఆ విశ్వసనీయతను చంద్రబాబు కోల్పోయారనే చెప్పవచ్చు. ఇది స్వయంకృతాపరాధమేనని అంటున్నారు.