చిరంజీవి శాసనసభ్యులకు మొండిచేయే?

శానససభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాన్ని విస్తరించే ఉద్దేశంతో ఉన్నారు. అప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఆగాల్సిందేనని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు నచ్చజెప్పేందుకు ఆయన ఓ సాకును కూడా వెతుక్కుంటున్నారు. చిరంజీవికి తగిన పదవి లభించిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు చెప్పడానికి సిద్ధపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి 17 మంది శానససభ్యులున్నారు. చిరంజీవిని మినహాయిస్తే 16 మంది ఉంటారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తే మిగతా వారు ఆసంతృప్తికి గురయ్యే అవకాశాలున్నాయని, అది నష్టం చేస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి నచ్చజెప్పేందుకు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభ ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాలు, ఉప ఎన్నికలు పూర్తయితే, తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడు మంత్రులందరి చేత రాజీనామాలు చేయించి, కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని 2014 ఎన్నికలకు సిద్ధం కావాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. ఈలోగా, తెలంగాణ అంశం కూడా తేలిపోతుందని అంటున్నారు. ఇక, వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావడం తప్ప మరో తలనొప్పి ఉండదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications