తెలంగాణ: ఐటి కంపెనీల మొత్తుకోలు
తెలంగాణ ఆందోళన వల్ల నిత్యావసర సేవకు అంతరాయం కలుగుతోందని ఐటి కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. వరుసగా ఆందోళనలు చెలరేగుతుండడంతో విస్తరణ ప్రణాళికలు కూడా ఆగిపోతున్నాయి. మరిన్ని నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాదులో ఐటి పరిశ్రమ కొనసాగడం కష్టమవుతుందని, ఐటికి అనువైన ప్రదేశంగా హైదరాబాదు ఉండబోదని అంటున్నారు. సకల జనుల సమ్మె సోమవారం 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె కారణంగా ఐటి బెల్టు ఉన్న మాదాపూర్లో రోజుకు ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. రెండు గంటలు అధికారికంగా విద్యుత్తును కోత విధిస్తుండగా, తరుచుగా విద్యుత్తు సరఫరాకు అనధికారికంగా కోత పడుతోంది. బ్యాకప్ పవర్ సప్లయ్ని కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల కోసం క్యాబ్స్ నడుపుతున్నాయి.
కాగా, తాజాగా ఐటి కంపెనీలకు మరో దెబ్బ పడింది. సోమవారం ఐటి కంపెనీలకు వెళ్తున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. హైదరాబాదులో ఐటి కంపెనీలు ఉన్న ప్రాంతంలో తెలంగాణవాదులు మోహరించి ఐటి ఉద్యోగులను అడ్డుకున్నారు. ప్రభుత్వం వారికి రక్షణ కల్పించలేని స్థితిలో ఉంది. మొత్తం మీద హైదరాబాదులో ఐటి పరిశ్రమ తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కుంటోంది.