వెనక్కి తగ్గిన కెసిఆర్
రాజీనామా చేయడం వల్ల తిరిగి ఉప ఎన్నికలు వస్తాయి తప్ప ప్రయోజనం లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను రాజీనామా ద్వారా మరోసారి ప్రతిబింబించాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడమే ఇప్పుడు కావాల్సిందని సీనియర్ నాయకులు కెసిఆర్తో చెప్పారు. ఈ విషయాన్ని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. పార్లమెంటు సభ్యుడిగానే ఉండి పోరాటం చేయాలని తాము అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. దీంతో కెసిఆర్ వెనక్కి తగ్గినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పెట్టిన ఒత్తిడి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, రాజీనామాలు చేయడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, కొంత మంది పార్టమెంటు సభ్యులు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిని ఆ దిశగా నడిపించడమే ఇప్పుడు తెరాస ముఖ్య కార్యక్రమంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసిన నేపథ్యంలో ఒకరిద్దరు రాష్ట్ర మంత్రులు, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ, మందా జగన్నాథం వంటి పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే, తాము కావూరిపై ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని, తమకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రమని వారు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అధిష్టానంపై ఒత్తిడి పెంచే దిశలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు కదులుతున్నారు. వారి చర్యలను గమనించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.