కిరణ్ కుమార్ కు మూడిందా?
తెలంగాణ ఇచ్చే ఉద్దేశం కాంగ్రెసు అధిష్టానం ఎలాగూ లేదు కాబట్టి పదవులతో తెలంగాణ నాయకులకు గాలం వేయడానికి సోనియా సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇద్దరు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధపడినట్లు టీవీ చానెల్ చెప్పింది. అయితే, వారెవరో సాక్షి టీవీ చానెల్ చెప్పలేదు. వైయస్ జగన్కు ప్రత్యర్థులైన కె. కేశవ రావు, వి. హనుమంతరావులను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్య చేసి ఉంటుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సహకారం తీసుకోవాలని కూడా భావిస్తోందట. కెసిఆర్ను విశ్వాసంలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని, తెలంగాణకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తోందట.
ముఖ్యమంత్రి పదవికి ముగ్గురి పేర్లను కాంగ్రెస్ ఆధిష్టానం పరిశీలిస్తున్నట్లు సాక్షి టీవీ చానెల్ చెప్పింది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కె. జానారెడ్డి పేర్లను పరిశీలిస్తోందని సమాచారం. అయితే, జానారెడ్డి కన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్పై పట్టు లేదు. ఆయన కోదాడ నియోజకవర్గంలో తెలంగాణవాదం బలంగా లేదు. ఇటీవల ఆయన తోటి ఆర్. దామోదర్ రెడ్డి వంటి తెలంగాణ శాసనసభ్యుల వద్ద అదే వాదనను వినిపించారని చెబుతున్నారు. అయితే, గతంలో ముఖ్యమంత్రి పదవికి జైపాల్ రెడ్డి అంగీకరించకపోవడం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభించిందనే విషయాన్ని గానీ మరో మర్రి చెన్నారెడ్డి అవుతారనే అపవాదును మోయడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి పదవిని తీసుకోలేదని జైపాల్ రెడ్డి చేసిన ప్రకటనను గానీ సాక్షి టీవీ చానెల్ పరిగణనలోకి తీసుకోలేదు.