తెలంగాణపై సిఎం తడాఖా చూపుతారా?
రైల్ రోకో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనుంది. దీన్ని విఫలం చేయడానికి ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైళ్లను నడిపించాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గాను ఆయన సంబంధిత ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. రైలో రోకోను విఫలం చేయగలిగితే సకల జనుల సమ్మెను ఏదో రూపంలో పరిష్కరించగలరనే నమ్మకం అధిష్టానానికి కలుగుతుందనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె నుంచి వివిధ వర్గాలను తప్పించడానికి ఆయన చర్చలను ముందుకు తెచ్చారు. అవసరమైతే అందుకు తెలంగాణ సంఘాల్లో చీలక తెచ్చేందుకు కూడా ప్రయత్నించాలని ఆయన చూస్తున్నారు.
విద్యాసంస్థలను మూసేయాలనే తెలంగాణ రాజకీయ జెఎసి నిర్ణయంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ వంటి నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. తల్లిదండ్రుల చేత విద్యాసంస్థలు తెరిపించాలనే డిమాండ్ను ముందుకు తెస్తున్నారు. అయితే, పాఠశాల, ఇంటర్మీడియట్ కాలేజీల విద్యార్థులు సమ్మె చేయడం లేదు. టీచర్లు, ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఆర్టీసి బస్సులను ఆర్టీసి కార్మికులు లేకుండా నడిపించాలనే ప్రయత్నం విఫలమైంది. ప్రభుత్వ విద్యాసంస్థలను రిటైర్డ్ టీచర్లతో లేదా నిరుద్యోగ యువతతో నడిపించాలనే ప్రయత్నాలు ముఖ్యమంత్రి సాగిస్తారా అనేది చూడాలి. మొత్తం మీద, ముఖ్యమంత్రి తన సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.