విచారణలు: చంద్రబాబు వర్సెస్ జగన్
పిటిషన్లు వేసినప్పుడు, వాటిపై హైకోర్టు విచారణలకు ఆదేశించినప్పుడు ఏ తప్పూ చేయకపోతే ఎదుర్కోవడానికి సిద్ధపడతారని అందరూ అనుకునే మాట. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనప్పుడే విమర్శలు ముందుకు వస్తాయని అంటున్నారు. గతంలో జగన్పై చేసిన ఈ వాదన సరిగ్గా ఇప్పుడు చంద్రబాబుకు కూడా వర్తిస్తుందని చెబుతున్నారు. గుడ్డిలో మెల్లలా చంద్రబాబుకు కలిసి వచ్చే అంశం ఏమిటంటే - హైకోర్టు విచారణకు ఆదేశించే ముందు చంద్రబాబు వాదనలను వినకపోవడం. దాన్ని ఆసరా చేసుకుని హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
సిబిఐని తాజాగా, అంటే చంద్రబాబు ఆస్తులపై హైకోర్టు విచారణకు ఆదేశించిన తర్వాత, వైయస్ జగన్ కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యనే చంద్రబాబు చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. అయితే, జగన్పై సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లు కాస్తా బాణీ మార్చారు. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ జరుగుతోంది కాబట్టి నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు కూడా హైకోర్టు ఆదేశాల మేరకే చంద్రబాబు ఆస్తులపై విచారణ జరగనుంది. ఇప్పుడు కూడా అదే రీతిలో నిష్పాక్షికంగా సిబిఐ విచారణ జరుగుతుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడం లేదనేది ప్రశ్న. మొత్తం మీద, రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రధాన నాయకులు చంద్రబాబు, వైయస్ జగన్ సిబిఐ విచారణల చిక్కుల్లో ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్నారని చెప్పక తప్పదు.