సోనియా ప్లాన్కు చిరు అస్త్రం
కోస్తాంధ్ర కమ్మ సామాజిక వర్గానికి ప్రత్యర్థి సామాజిక వర్గం కాపులను చేరదీయాల్సిన అవసరం, తెలంగాణలో రెడ్లకు వ్యతిరేకంగా వెలమ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెసు పార్టీకి ఏర్పడిందని అంటున్నారు. తెలంగాణలోని వెలమలు, కోస్తాంధ్రలోని కాపులు కలిస్తే రాష్టంలోని రెండు అగ్రకులాలను అధికారానికి దూరం చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని సోషలిస్టులు చాలా కాలంగా అంచనాలు వేస్తూ వస్తున్నారు. ఇందులో బిసి అంశం కూడా ఉంది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన పక్కన సోషలిస్టులు ఉన్నారు. వారి సలహాల మేరకు తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా బిసిలను, దళితులను ఆయన ఎక్కువగా ప్రోత్సహించారు. అందుకే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బిసిల మద్దతు ఏదో మేరకు ఉంది. వెలమ, కాపులకు తోడు బిసిలు కూడా కలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చుననే అంచనా ఉంది. అందుకు అనుగుణంగా సామాజిక వర్గాల సమీకరణకు కాంగ్రెసు అధిష్టానం పూనుకున్నట్లు, అందులో భాగంగానే చిరంజీవిని పార్టీలోకి అహ్వానించినట్లు చెబుతున్నారు.
కోస్తా కాపులను బిసిల్లో చేర్చాలని చాలా కాలంగా కాపునాడు వంటి సంస్థలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మున్నూరు కాపు, ఇతర ప్రాంతాల్లో శెట్టిబలిజ, తదితర కులాలు కూడా కాపులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అంచనా. ఈ మేరకే వి. హనుమంతరావు, కె. కేశవరావు, డి. శ్రీనివాస్ వంటి బిసి నాయకులు చిరంజీవిని పార్టీలోకి తీసుకురావాలని సలహాలు ఇచ్చి, ఆ ప్రక్రియను పూర్తి చేయించినట్లు సమాచారం. వైయస్ జగన్ను ఎదుర్కోవడానికి అంతకు మించిన మార్గం లేదని వారు సూచించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా కలుపుకుంటే ఆపరేషన్ పూర్తవుతుదని, ఆ రెండు సామాజిక వర్గాల ఆధిపత్యానికి గండి పడడమే కాకుకండా కాంగ్రెసుకు గట్టి పునాది ఏర్పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.