ఎవరీ సాంబశివుడు?
అప్పటి పీపుల్స్వార్ ఇప్పటి మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు సాంబశివుడు సంచలనాలకు ప్రతీకగా నిలిచాడు. ఆయన సోదరుడు కూడా నక్సలైట్ ఉద్యమంలో పనిచేశాడు. సోదరుడు రాములు గతంలో పోలీసులకు లొంగిపోయారు. సాంబశివుడిపై ఉన్న మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. ఒక కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొంటూ వస్తున్నాడు. పలు తెలంగాణ సభల్లో ఆయన పాల్గొన్నారు.
ఆ తర్వాత కొంత కాలానికి ఆయన కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. తెరాసలో నల్లగొండ జిల్లా భువనగిరి ఇంచార్జీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తూ వస్తున్నారు. అయితే, గతంలో పీపుల్స్ వార్లో పని చేసిన నయీంకు సాంబశివుడికి వ్యక్తిగత వైరం ఉన్నట్లు తెలుస్తోంది. నయీం కూడా భువనగిరి ప్రాంతానికి చెందినవాడే. పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ) నాయకులను, సానుభూతిపరులను బయటకు వచ్చిన తర్వాత లక్ష్యం చేసుకుని హత్యలకు పూనుకున్నాడని, అందుకు నయీం ఓ ముఠాను తయారు చేసుకున్నాడని అంటారు.
నయీం నుంచి తన కుమారుడు సాంబశివుడికి ప్రాణహాని ఉందని సాంబశివుడి తల్లిదండ్రులు గతంలో ఆరోపించారు. నయీం నుంచి తనకు ప్రాణహాని ఉందని సాంబశివుడికి కూడా తెలుసంటారు. అయితే, నయీం పక్షవాతంతో బాధపడుతూ పడక మీదనే ఉంటున్నాడని సాంబశివుడికి తెలిసి, స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాంబశివుడి హత్య జరిగిందని అంటున్నారు. కాగా, భూ వివాదాలు కూడా సాంబశివుడి హత్యకు కారణమై ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది.