ఉప ఎన్నికలకు తొందరపడుతున్న జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం మాట్లాడిన మాటలు గానీ వైయస్ జగన్ అంతకు ముందు మాట్లాడిన మాటలు గానీ అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. శాసనసభ్యులపై అనర్హత వేటుకు చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెసు మీనమేషాలు లెక్కిస్తుండడంపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. శాసనసభ్యులందరిపై ఒకేసారి వేటు వేయాలని, అన్ని స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలని జగన్ అంటున్నారు. ఇందులో రాజకీయం చేయకూడదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగితే అది మినీ సమరాన్ని తలపిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను మట్టి కరిపించాలనే ఆతురతతో జగన్ ఉన్నారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 18 మంది శానససభ్యులు నిలబడడం వల్ల పరువు దక్కిందనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. ఉప ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు. అయితే, పరకాల శానససభ్యురాలు కొండా సురేఖకు ఎదురుగాలి వీచే అవకాశాలున్నాయి. కొండా సురేఖకు తెరాస మద్దతిచ్చే అవకాశం లేదని అంటున్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొండా సురేఖకు మద్దతిస్తే తెరాస ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. తెలంగాణ అనుకూలంగా వైయస్ జగన్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొండా సురేఖకు మద్దతు తెలపడం తెరాసకు సులభం కాదు. మొత్తం మీద, జగన్ ఉప ఎన్నికలను ఎదుర్కుని తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications