చిరు మార్క్ రాజకీయం: వైఎస్ వ్యతిరేకులతో దోస్తీ
మూడు రోజుల క్రితం జరిగిన సేవ్ కాంగ్రెసు సదస్సులో చిరంజీవి స్వంత పార్టీ పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెసు ఇల్లు భద్రంగా ఉంటుందని తాను భావించానని, కానీ ఈ భవనం బీటలు వారి, పైకప్పు చెల్లా చెదురై తనలో అభద్రతా భావం నెలకొల్పుతోందని చిరంజీవి పార్టీ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాఖ్యలకు బొత్స కూడా పరోక్షంగా ఘాటుసమాధానమిచ్చారు. కాంగ్రెసును పునాదులతో పెకిలిస్తామని ప్రకటించిన నాయకులు ఆ తర్వాత కనుమరుగై ఆ తర్వాత కాంగ్రెసులోనే విలీనమయ్యారని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యానించారు.
చిరంజీవి వ్యాఖ్యలు, అందుకు కౌంటర్గా బొత్స మాటలు ఇరువురి మధ్య ఉన్న విభేదాలను బహిర్గతం చేసినట్లుగా చెబుతున్నారు. మరోవైపు కిరణ్తో కూడా చిరంజీవి ఈ మధ్య అంటీముట్టనట్లుగానే కనిపిస్తున్నారు. బొత్సతో దూరం పెరిగిన తర్వాత కొద్దిరోజులు కిరణ్కు దగ్గరవుతున్నట్లు కనిపించారు. కానీ అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. చిరంజీవి, బొత్స, కిరణ్ ఎవరికి వారే 'ముఖ్య' పదవిపై కన్నేశారు. దీంతో ఒకరికి మరొకరు దూరమై ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అందులో భాగంగానే సిఎం వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందని అంటున్నారు. ముఖ్యమంత్రి గతంలో మంత్రులకు తెలియకుండానే అనేక నిర్ణయాలు తీసుకునే వారు. దీంతో పలువురు మంత్రులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల సిఎం వైఖరిలో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తోందని అంటున్నారు. మంత్రులతో చర్చించడంతో పాటు నేతలతో టచ్లో ఉంటున్నారట. అదే సమయంలో ప్రజల్లోకి కూడా వెళుతున్నారు.
బొత్స కూడా పార్టీ నేతలతో భేటీలు జరుపుతూ, జిల్లాలు తిరుగుతూ ఉన్నారు. ఇక చిరంజీవి తన మార్క్గా రాజకీయం నెరపుతున్నారని అంటున్నారు. సేవ్ కాంగ్రెసు పేరిట రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు కార్యక్రమానికి ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ చిరంజీవి హాజరయ్యారు. విహెచ్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
చిరంజీవి వైయస్ను మొదటి నుండి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెసులో చేరిన కొత్తలో కూడా పలుమార్లు వైయస్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత విమర్శలు గుప్పించనప్పటికీ వైయస్ పేరును మాత్రం చిరు ఎక్కడా ఉపయోగించడం లేదు. అప్పుడప్పుడు వైయస్ పైన ఉన్న వ్యతిరేకత బయట పడుతోంది. దీంతో చిరు ఆయన వ్యతిరేకులకు తన దరికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని, కిరణ్, బొత్సలపై ఆగ్రహంతో ఉన్న వారిని ఏకతాటిపైకి తీసుకు వస్తున్నారని అంటున్నారు.