సికె బాబు: వైయస్ జగన్ పార్టీలో వర్రీ
సికె బాబు కుటుంబ సభ్యులు తమ పార్టీలోకి రాకుండా అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలపై చర్చించడానికి ఈ నెల 8వ తేదీన కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో సికె బాబు ఏం చేసినా అది ఓ చర్చగా మారడం పరిపాటి. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రస్తుత తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి సికె బాబు వైయస్ జగన్ను కలిశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏర్పడిన తర్వాత వైయస్ జగన్ చేపట్టిన ఫీజు పోరు యాత్రకు సికె బాబు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దాంతో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్లిపోతారనే ప్రచారం సాగింది. అయితే, ఆ తర్వాత సికె బాబు నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలుగుదేశం మాజీ శానససభ్యుడు మనోహర్ను సీన్లోకి తెచ్చారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పిస్తామనే హామీతో ఆయనను పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలు చేశారు.
ఆ తర్వాత వైయస్ జగన్ ప్రజారాజ్యం మాజీ నాయకుడు జంగాలపల్లి శ్రీనివాస్ను, మరో తెలుగుదేశం నాయకుడిని పార్టీలోకి లాక్కోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించారు. అయితే దానికి కాంగ్రెసు నాయకుడు ఆదికేశవులు నాయుడు అడ్డు పడినట్లు చెబుతారు. అయితే, మనోహర్ తమకు సరైన అభ్యర్థి కాదని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. తాను పార్టీలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ పార్టీలోకి రాలేదని అంటున్నారు.