చిరంజీవి యమ స్పీడ్: అధిష్టానం బాసట
సానుభూతి, కన్నీళ్లు తదితరాలు ఉప ఎన్నికలలో ప్రభావం చూపాయని చెబుతున్న నేతలతో మరి రామచంద్రాపురం, నరసాపురంలలో అది ఎందుకు పని చేయలేదని అధిష్టానం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇవే ప్రశ్నలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కూడా తొలిచివేస్తున్నాయి. రామచంద్రపురం, నరసాపురంలలో పార్టీ అభ్యర్థులు సానుభూతి పవనాలను ఎలా ఎదుర్కోగలిగారనే దిశగా చర్చ నడుస్తోంది. ఈ రెండు స్థానాల ఫలితాల నేపథ్యంలో సానుభూతి సాకును ఢిల్లీ పెద్దలు తోసిపుచ్చుతున్నారట.
ఈ ఓటమికి దారితీసిన నిజమైన, బలమైన కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పార్టీ సమన్వయ కమిటీ సమావేశమై ఫలితాలపై మధించింది. సానుభూతి మాత్రమే పార్టీ అభ్యర్థులను ఓడించిందన్న రాష్ట్ర నేతల అభిప్రాయంతో ఢిల్లీ పెద్దలు ఏకీభవించడం లేదని తెలుస్తోంది. ఓటమికి పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడటం కూడా ప్రధాన కారణమని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి భావిస్తున్నారు.
ప్రజారాజ్యం, కాంగ్రెస్ శ్రేణుల మధ్య సమన్వయ లోపమే ఓటమికి ప్రధాన కారణమని కూడా పేర్కొంటున్నట్లు తెలిసింది. తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడు గతంలో పిఆర్పీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈసారి వారే కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరు పిఆర్పీ శ్రేణులు, కార్యకర్తలతోపాటు కాంగ్రెస్ నేతలందరితో మమేకమై ముందుకు సాగారని, ఆ నియోజకవర్గాల్లో సమష్టితత్వం కనిపించిందని, మిగిలిన చోట్ల గత పిఆర్పీ నేతలను కాంగ్రెస్ నాయకులు గుర్తించలేదని చిరంజీవి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల పోస్టుమార్టం సమావేశంలో చిరంజీవి ఒకింత ఆవేశంగా మాట్లాడారట. కొత్తపల్లి, తోటలు గతంలో పిఆర్పీ నేతలు అయినప్పటికీ వారు కాంగ్రెసు నేతలను కలుపుకొని వెళ్లడం వల్లే విజయం సాధించారని, మిగిలిన నియోజకవర్గాలలో కాంగ్రెసు నేతలు పిఆర్పీని కలుపుకొని వెళ్లలేదని, అందుకే ఓటమి చెందామని కిరణ్, బొత్స సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారట. సానుభూతి, కన్నీళ్లు అని పలువురు నేతలు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో చిరంజీవి విభేదిస్తున్నారట. అధిష్టానం కూడా అదే భావనతో ఉందని అంటున్నారు. రామచంద్రాపురం, నరసాపురంలలో సానుభూతి ఎందుకు పని చేయలేదని కలిసిన వారిని ప్రశ్నిస్తున్నారట.
సానుభూతి, సమన్వయ లోపం పక్కన పెడితే కాంగ్రెస్ నేతలు పలువురు లోపాయికారీగా జగన్ పార్టీకి సహకరించడం కూడా ఓటమికి కారణమని ఇంకొందరు పేర్కొంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరిగిన విషయాలేమిటో తెలుసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. గురువారం నుంచి ఉప ఎన్నికల ఫలితాలపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సమీక్ష జరపనున్నారు. అలాగే శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటి సిఎం రాజనరసింహ, బొత్స సత్యనారాయణ తదితరులు జిల్లాలవారీ సమీక్ష సమావేశాలు జరపనున్నారు.