జగన్, కెసిఆర్ ఆ రెండు పార్టీల టార్గెట్
తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం కూడా తెలుగదేశం పార్టీకి పిడుగుపాటుగా పరిణమించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెసిఆర్, జగన్ చేతులు కలిపారని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది. కెసిఆర్ది దొంగ దీక్ష అని పదే పదే విమర్శలు చేస్తోంది. తెలంగాణలోని ఆరు శాసనసభా స్థానాల్లో కూడా తన సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అలాగే, సీమాంధ్రలోని కోవూరు సీటును తిరిగి దక్కించుకునే ఆలోచన కూడా చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి మళ్లీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయనున్నారు.
మరోవైపు, కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదనే జగన్ నిర్ణయాన్ని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు తప్పు పడుతున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి, వీరశివా రెడ్డి జగన్పై దుమ్మెత్తిపోశారు. వైయస్సార్ కడుపున చెడబుట్టాడని ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి చెప్పాలని వీరశివా రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కొండా సురేఖను గెలిపించుకోవడానికి మిగతా సీట్లను జగన్ వదిలేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు మాత్రం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణలో ఎలాగైనా తన సత్తా చాటాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ ద్వారా యువతను ఆకట్టుకోవాలని ఆయన చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత మూడు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెసు పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.