జూ. ఎన్టీఆర్తో కొడాలి నానికి విభేదాలు?
కృష్ణా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్కు, లేదంటే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం మద్దతిస్తూ వస్తోంది. వీరికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావు వర్గంతో పడడం లేదు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వద్ద దేవినేని ఉమదే పైచేయిగా ఉంటూ వస్తోంది. ప్రతిసారీ వల్లభనేని వంశీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వల్లభనేని వంశీ విజయవాడ నడిరోడ్డు మీద మంతనాలు జరపడం తీవ్ర దుమారం రేపింది. ఆ దుమారం కాస్తా జూనియర్ ఎన్టీఆర్కు చుట్టుకుంది. అయితే, ఈ వ్యవహారంపై చాలా కాలం మౌనంగా ఉండిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా మాట్లాడారు. తన సినిమాకు వంశీ నిర్మాత మాత్రమేనని ప్రకటించారు. దమ్ము సినిమా విడుదల రోజే, తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా బంద్కు పిలుపునివ్వడం జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో తిరుగుబాటు బావుటా ఎగురేసేందుకు వారు సిద్ధపడినట్లు చెబుతారు. ఇదంతా జూనియర్ ఎన్టీఆర్కు చెప్పిన తర్వాతనే చేశారని అంటారు.
నూజివీడు తెలుగుదేశం శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య, వంశీ, కొడాలి నాని మధ్య ఆ మధ్య ఓ సమావేశం జరిగినట్లు, ఆ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ కూడా పాల్గొన్నట్లు ఇటీవల ఓ వార్తాకథనం ఓ టీవీ చానెల్లో ప్రసారమైంది. ఈ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ తీరు పట్ల కొడాలి నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
కొసమెరుపు ఏమిటంటే - కొడాలి నాని నిర్మాతగా రావాల్సి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా ముందుకు వచ్చారు. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గల విభేదాలకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలంటూ ఆ టీవీ చానెల్ ముక్తాయింపు ఇచ్చింది.