సినిమా ట్రిక్స్: పొలిటికల్ టచ్కోసం హీరోల తహతహ

తన రాజకీయ ఆరంగేట్రం ద్వారా టిడిపికి లబ్ధి చేకూర్చాలని బాలకృష్ణ పొలిటికల్ టచ్ సినిమాలకు సిద్ధమౌతుంటే, కాంగ్రెసును 2014లో మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా, అందరూ మెచ్చే ఓ మంచి పొలిటికల్ కథ కోసం చిరంజీవి ఎదురు చూస్తున్నారు. ఇటీవల పరిశీలకుడిగా రాష్ట్రానికి వచ్చిన వాయలార్ రవి కూడా చిరంజీవికి పర్యటనలు, యాత్రల కంటే సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చిరుకు సూచించారు.
మొదట్లో బిజెపిలో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా ఉన్న కృష్ణం రాజు కొద్దికాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కార్యకర్తలు, అభిమానుల సూచనల మేరకు, తాను రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల వారికి కలిగే నష్టాన్ని పూరించడానికే తిరిగి ఏదో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దాంతో పాటే రాజకీయ కోణంలో మంచి కథ దొరికితే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో తన ప్రాధాన్యం తగ్గుతోందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని, ఇందులో భాగంగా ఆయన సినిమాలు వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేసుకుంటున్నారని అంటున్నారు. టిడిపికి దూరమయ్యే పరిస్థితులు తలెత్తిన పక్షంలో ఒంటరిగానే రాజకీయాలలో జూనియర్ ప్రధాన పాత్ర పోషించే విధంగా హరికృష్ణ వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. రెండు రోజుల క్రితం జూనియర్కు అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. దాని వెనుక జూనియర్ ఉండవచ్చుననే ప్రచారం కూడా జరిగింది.
ఇటీవల విడుదలైన దమ్ము చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చి వదిలేశారు. టచ్ కొద్దిగానే ఉన్నప్పటికీ అవి భారీ డైలాగులే. పురుగులు పట్టిన బియ్యం, పుచ్చిపోయిన పప్పులు ఇస్తున్నారని, ప్రాజెక్టులు కడతామని చెప్పి ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారని, కంపెనీలు తెస్తామని సెజ్ల పేరుతో భూములు లాక్కున్నారనే అర్థం వచ్చేలా ఈ చిత్రంలో డైలాగులు ఉన్నాయి. దేవుడి ఆశీస్సులు ఉంటే రాజకీయాల్లోకి వస్తానని కూడా జూనియర్ తన దమ్ము ద్వారా చెప్పారు.
ఇక త్వరలో రానున్న బాలకృష్ణ అధినాయకుడు చిత్రం పూర్తి రాజకీయ రంగు పులుముకున్న చిత్రంగానే కనిపిస్తోంది. అందులో బాలకృష్ణ మూడు పాత్రలు పోషిస్తున్నారు. తాత పాత్ర చిరంజీవిని టార్గెట్గా చేసుకున్నదనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. సింహ సినిమాలో పొలిటికల్ లేకున్నప్పటికీ ప్రజల బాగు కోరే వ్యక్తి ఎలా ఉండాలో చూపించారు. అధినాయకుడు దాదాపు పూర్తి రాజకీయ చిత్రంగానే ఉంది.
అధినాయకుడి ద్వారా బాలయ్య తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశించుకోనున్నారు. చిరంజీవి, కృష్ణంరాజులు కూడా రాజకీయాలకు సంబంధించి మంచి కథ దొరికితే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, జూనియర్లు మరిన్ని సినిమాలు ఈ కోణంలో తీసేందుకు సై అంటున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications