వైయస్ జగన్ అరెస్టయితే కోర్ కమిటీ?
వైయస్ జగన్ అరెస్టు జరిగితే పార్టీ కోర్ కమిటీ పార్టీ వ్యూహాలను ఖరారు చేస్తుంది. పార్టీని ముందుకు నడిపించేందుకు అవసరమైన ప్రణాళికను ఖరారు చేస్తుంది. ఈ కోర్ కమిటీ ఏర్పాటు కూడా ఇప్పటికే జరిగిపోయినట్లు చెబుతున్నారు. కోర్ కమిటీలో సుబ్బా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కొణతాల రామకృష్ణ, భూమా నాగి రెడ్డి ఉన్ననట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వహణ బాధ్యతను కోర్ కమిటీ చూసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయోగాలు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు.
కాగా, ప్రచార బాధ్యత మాత్రం వైయస్ జగన్ తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చూసుకుంటారు. ఆమె విస్తృతంగా ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. ఓదార్పు యాత్రను ఆమె కొనసాగించబోరని అంటున్నారు. జగన్ అరెస్టయితే, దాన్ని ఎదుర్కునేందుకు, దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలోకి విజయమ్మ దిగుతారని అంటున్నారు. పార్టీని నిలబెట్టడం ద్వారా, ఉప ఎన్నికల్లో విజయాలు సాధించడం ద్వారా కాంగ్రెసు పార్టీకి స్పష్టమైన సంకేతాలు పంపాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే జగన్ను అరెస్టు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విస్తృతమైన ప్రచారం చేపట్టే అవకాశాలున్నాయి.