ఎన్టీఆర్ వారసత్వాన్ని బాబు కొనసాగిస్తున్నారా?

భారతదేశం ఫెడరల్ వ్యవస్థ అనే స్పష్టమైన అవగాహన ఆయనకు ఉంది. ఇందులో భాగంగానే ఆయన గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఉండాలని భావించారు. అలా రూపు దిద్దుకుందే నేషనల్ ఫ్రంట్. ఇక సోషలిస్టు భావాలు ఆయనను ముందుకు నడిపించాయి. పేదల కోసం ఆయన ప్రవేశపెట్టడానికి ఈ సోషలిస్టు భావాలే కారణమే. ఆయనకు ఎప్పటికప్పుడు సలహాలు అందించడానికి ఆయన చుట్టూ సోషలిస్టులు ఉండేవారు. ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే ఎంతటి కఠిన నిర్ణయమైనా సరే, ఏ మాత్రం తొణుకు బెణుకు లేకుండా తీసుకునేవారు.
ఎన్టీఆర్ వారసత్వాన్ని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానమే వస్తుంది. ఎన్టీఆర్ ప్రజాబలాన్ని నమ్ముకుంటే చంద్రబాబు కోటరీలను నమ్ముకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు పేదల ప్రజల నుంచి మధ్యతరగతి చదువుకున్నవారి వైపు నడిపించారు. చదువుకున్న ఈ మధ్య తరగతి పార్టీకి ఎల్లవేళలా కట్టుబడి ఉండేది కాదు. ఎక్కడ ప్రయోజనాలు కనిపిస్తే అక్కడికి గంతులు వేస్తుంది. అందుకే చంద్రబాబును దెబ్బ తీయడానికి ఎన్టీఆర్ బాటలో వైయస్ రాజశేఖర రెడ్డి నడిచి విజయం సాధించారు.
ఐటి ప్రొఫెషనల్ వంటి కొత్త యువతరానికి ఇప్పటికీ చంద్రబాబు నాయకుడే కావచ్చు గానీ ప్రజలందరి నాయకుడూ కాలేకపోయారు. ఎన్టీఆర్ ఎవరికీ భయపడే వారు కాదు, తన పేద ప్రజల పక్షపాతమే తనను నిలబెడుతుందని ఆయన నమ్మారు. ఆ స్థితిలో రెండో స్థానంలోకి వచ్చిన ఏ నాయకుడు వెళ్లిపోయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరలేదు. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటును పక్కన పెడితే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జానా రెడ్డి వంటి సీనియర్ నాయకులు తిరుగుబాటు ప్రకటించినా తెలుగుదేశం పార్టీ నిలబడింది. కానీ, చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ నిలబడుతోందే గానీ అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించలేని స్థితికి చేరుకుంది. ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను చంద్రబాబు నీరు గారుస్తూనో, రద్దు చేస్తూనో పోవడం వల్ల పార్టీ పేద ప్రజలకు దూరమవుతూ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ కోలుకునే స్థితి కూడా లేదనిపిస్తోందని చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే మీడియా సంస్థలే వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications