సిబిఐ కేసుపై జగన్ వ్యూహం ఫలిస్తోందా?
ఓ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం - గతంలో తనకు సన్నిహితంగా వ్యవహరించిన మంత్రులను పిటిషన్లో మినహాయించడం, కేసులు ఎదుర్కొంటున్న వారిని కాంగ్రెస్ విడిచిపెట్టాలన్న యోచన కల్పించడం ద్వారా తన వైపు మళ్లించుకునే ఎత్తుగడతోనే కేసులు వేయించి ఉంటారన్న అనుమానంతో పార్టీ సీనియర్లు కొత్త కోణంలో విశ్లేషిస్తున్నారు. నిజానికి, వైఎస్ హయాంలో ఒకరిద్దరు మినహా, మిగిలిన మంత్రులందరిపైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వారి పేర్లు పిటిషన్లో ప్రస్తావించకపోవడాన్ని విశ్లేషించిన సీనియర్లు ఈ కోణానికి తెరలేపారు. వారి పేర్లను చేర్చకపోవడం బట్టి, మిగిలిన వారిని తన వైపు మళ్లించుకునే ఒత్తిడి వ్యూహమేనని చెబుతున్నారు.
బొత్స సత్యనారాయణ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 2005-10 పాలసీ ప్రవేశపెట్టగా, అప్పట్లో వెలువడిన ఉత్తర్వు ఆధారంగానే ఆ తర్వాత వచ్చిన మంత్రి కన్నా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, పాలసీ పెట్టినప్పుడు ఉన్న మంత్రి బొత్స పేరు ప్రస్తావనలో లేకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం గట్టిగా పనిచేసినందుకే కన్నా పేరు ప్రస్తావించారన్న అనుమానం వ్యక్తమవుతోంది. అదే విధంగా మేఘమధనంలో అప్పటి వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి, త్రిశూల్ సిమెంట్ అనుమతిలో నాటి మంత్రి జెసి దివాకర్రెడ్డి వంటి వారిపై అవినీతి ఆరోపణలున్నప్పటికీ, పిటిషన్లో ఎవరి పేర్లు లేకపోవడం బట్టి.. కేవలం కొందరిని లక్ష్యం చేసుకుని, మిగిలిన వారికి హెచ్చరిక సంకేతాలు పంపించేందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.
కాగా, నోటీసుల వ్యవహారం ఇరకాటంలో పెడుతున్న నేపథ్యంలో తనకు జగన్తో ఎలాంటి శత్రుత్వం లేదని నోటీసులు అందుకోనున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించడం జగన్ శిబిరంలో ఉత్సాహం నింపింది. ఫలితంగా తమ ఒత్తిడి వ్యూహం ఫలిస్తోందన్న ఆశాభావం వారిలో కనిపించింది. ఇదేరకంగా మరికొందరు మంత్రులు ప్రకటనలు ఇస్తే తమ ప్రయత్నం ఫలించినట్టేనన్న అంచనా వ్యక్తమవుతోంది. తమ పేర్లు పిటిషన్లో చేర్చని మంత్రుల్లో కూడా జగన్ పట్ల కృతజ్ఞతతో సానుకూల వైఖరి రావచ్చని జగన్ శిబిరం భావిస్తోంది.