రాష్ట్రపతి ఎన్నికలు: బాబులో జగన్ ఫ్రస్టేషన్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో జగన్, ఆయన పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ అధికార కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేసిన కుమ్మక్కు ఆరోపణ టిడిపిని దారుణంగా దెబ్బతీసిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రచార సమయంలో టిడిపి ప్రధానంగా జగన్ అవినీతి పైనే దృష్టి సారించింది. బాబు సహా నేతలంతా జగన్నే టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెసు పైన నామమాత్రంగానే విరుచుకు పడ్డారు.
దీంతో జగన్ అండ్ కో చేసిన ఆరోపణలు మరింత బలపడ్డాయి. జగన్ను టార్గెట్ చేసుకోవడం, కుమ్మక్కు ఆరోపణల ఫలితం టిడిపి ఉప ఎన్నికలలోనే చవిచూసింది. ఈ నేపథ్యంలో బాబు దాని నుండి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉప ఎన్నికల తర్వాత ఆయన జగన్ను లక్ష్యంగా చేసుకోవడం మానేశారు. అంతకుముందు కేవలం జగన్నే టార్గెట్ పెట్టుకున్న బాబు ఆ తర్వాత ఆయన అవినీతిపై మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు.
అవినీతి అని చెబుతున్నప్పటికీ నిత్యం జగన్ పేరే తలవడం వల్ల కూడా ఆయనకు ప్రజల్లో ఇమేజ్ పెరుగుతోందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. నిత్యం జగన్ జపం చేయడం వల్ల ఆయనను మనమే హీరోగా చేస్తున్నట్లుగా ఉందని టిడిపి నేతలు అధినేతకు చెప్పారట. దీంతో ఆయన జగన్ జపం మానుకున్నారని అంటున్నారు. తాజాగా కాంగ్రెసుతో కుమ్మక్కు అనే మరకను కూడా చెరిపేసుకునేందుకు రాష్ట్రపతి ఎన్నికలు ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.
ప్రణబ్ సరైన అభ్యర్థి అయినప్పటికీ ఆయనకు మద్దతిస్తే ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసుతో పోరాడుతున్న టిడిపి కుమ్మక్కు కావడం వల్లనే దాదాకు ఓటేశారనే అపవాదు మీద పడుతుంది. అది జగన్కు మంచి ఆయుధంగా ఉపయోగపడుతుంది. అలాంటి ఆస్కారం వైయస్సార్ కాంగ్రెసుకు ఇవ్వవద్దని బాబు కృతనిశ్చయంతో ఉన్నారట. అయితే ప్రణబ్కు మద్దతివ్వక పోవడం వెనుక జగన్ ప్రస్టేషన్ అయినప్పటికీ సంగ్మాకు మద్దతివ్వక పోవడం మాత్రం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఉన్న టిడిపి ఎవరో ఒకరికి ఖచ్చితంగా మద్దతివ్వాలంటున్నారు. కేవలం బిజెపి సమర్థించినందు వల్లే సంగ్మాకు ఓటు వేయమని చెప్పడం సరికాదని అంటున్నారు. బిజెపి సంగ్మాను బరిలోకి దింపలేదని, సంగ్మానే తనంత తాను అభ్యర్థిగా ప్రకటించుకున్నారని, ఆ తర్వాతే బిజెపి అభ్యర్థి దొరకని పరిస్థితిల్లో అతనికి మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ ప్రణబ్కు మద్దతిస్తే కుమ్మక్కుపై ఎదురుదాడి తీవ్రంగా చేయాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారని అంటున్నారు.