కెఎ పాల్ తమ్ముడి హత్య కేసును నీరు గార్చారా?
వార్తాకథనాల ప్రకారం - డేవిడ్ రాజు హత్య కేసులో మొదటి, రెండో, మూడో నిందితులైన కోటేశ్వర రావు, కేథరని శీతల్, సాల్మన్ రాజు అమెరికాలో ఉన్న కెఎ పాల్తో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన జాబితాను సిఐ జహంగీర్ సేకరించినట్లు తెలుస్తోంది. డేవిడ్ రాజు హత్యకు గురయ్యే చివరి క్షణం వరకు ఎవరెవరితో మాట్లాడారనే కాల్ డేటాను ఆయన సేకరించినట్లు చెబుతున్నారు. ఇవన్నీ సేకరించిన తర్వాత కేసు పరిశోధనను షాకీర్ హుసేన్కు అప్పగించారు. అది గల్లంతయినట్లు తెలుస్తోంది.
కేసు ఓ కొలిక్కి వస్తున్న సమయంలో తనను పరిశోధన నుంచి తప్పించడం భావ్యం కాదని సిఐ జహంగీర్ అప్పట్లో మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ సుధీర్ బాబుపై ఉన్నతాధికారుల సంఘానికి ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీనిపై ఏ విధమైన చర్యలూ లేవు., ఈ కేసులో రెండో నిందితురాలు కేథరిన్ విదేశాలకు పారిపోకుండా లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమె ఉగండాకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
కేథరిన్ శీతల్ పట్టుబడిన సమయంలో కెఎ పాళ్ ముంబైలోని ఓ ప్రముఖ హోటల్లో బస చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు సేకరించడానికి జహంగీర్ హోటల్ యజమానులను కలుసుకోవడానికి సమాయత్తమయ్యారని అంటారు. అయితే, ఉన్నతాధికారులు అడ్డు పడ్డారని చెబుతారు. కేథరిన్ను విమానాశ్రయం నుంచి హైదరాబాదు తీసుకొచ్చి పోలీసులు ప్రశ్నించారు. పాల్ డేవిడ్ రాజు హత్యకు పురమాయించినట్లు ఆమె చెప్పారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేయకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో కెఎ పాల్ అరెస్టయినట్లు తెలుస్తోంది.