కావూరి మొండిపట్టు: సోనియాకు తలనొప్పి
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారంనాడు కూడా కావూరిని కలిసి, రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు. తనకన్నా జూనియర్స్కు మంత్రి పదవులు కట్టబెట్టి సీనియర్ అయిన తనను విస్మరించారని కావూరి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పైగా, కాంగ్రెసు పార్టీకి దశాబ్దాల పాటు విధేయుడిగా ఉన్నానని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే, కావూరి రాజీనామాను ఉపసంహరించుకుంటారని బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
కావూరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉండిందని కాంగ్రెసు నాయకులంతా అంటున్నారు. నిజానికి, దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీలోకి తీసుకుని, కావూరికి మంత్రి పదవి ఇవ్వాలనేది సోనియా అభిమతంగా చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే పురంధేశ్వరిని మంత్రి పదవిని తప్పించాలని సోనియా మన్మోహన్ సింగ్ను కోరారని అంటున్నారు. అయితే, మన్మోహన్ సింగ్ అందుకు అంగీకరించలేదని చెబుతున్నారు.
మంచి ట్రాక్ రికార్డు ఉన్నందున పురంధేశ్వరిని మంత్రివర్గంలో కొనసాగించాలని, పైగా ఆమెకు ప్రమోషన్ ఇచ్చి కేబినెట్ హోదా ఇవ్వాలని మన్మోహన్ తలపెట్టారు. అయితే, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు వంటి సీనియర్ల అసంతృప్తి జ్వాలలతో ఆమె ప్రమోషన్ ఆగిపోయింది. ఇక, పురంధేశ్వరిని మంత్రి వర్గం నుంచి తప్పించే పరిస్థితి కూడా లేదు.
అదే సమయంలో కావూరి పార్టీ పదవి చేపట్టడానికి సుముఖంగా లేరు. పార్టీని గెలిపించడానికి తాము, పదవులు అనుభవించడానికి వేరేవారా అనే రీతిలో ఆయన వైఖరి ఉందని చెబుతున్నారు. దానివల్ల ఆయన పార్టీలో ప్రధాన బాధ్యతలు చేపట్టడానికి ఇష్టంగా లేరని అంటున్నారు. ఈ సమయంలో ఏం చేయాలనే ఆలోచనలో సోనియా గాంధీ పడినట్లు చెబుతున్నారు.