వైయస్ జగన్పై కిరణ్ కుమార్ మరో అస్త్రం
ప్రస్తుతం ఖాళీ అయిన 17 స్థానాలకు రాష్ట్రపతి ఎన్నికల లోపు, అంటే మే, జూన్ నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని తెలియడంతో మరో ఎత్తుగడకు ముఖ్యమంత్రి తెర తీశారని అంటున్నారు. ఖాళీ అయిన 17 స్థానాల వివరాలను ఎన్నికల కమిషన్కు తెలియజేయడంలో జాప్యం చేస్తున్నారని అంటున్నారు. ఖాళీ అయిన స్థానాల వివరాలను సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా ఎన్నికల కమిషన్కు తెలియజేయాలి. కానీ ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు.
కాంగ్రెసుకు చెందిన 16 మంది శానససభ్యులపై వేటు వేసిన విషయాన్ని, శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. ఆ విషయంపై ఆయన ఐదవ తేదీన శాసనసభలో ప్రకటన చేశారు. స్థానాలు ఖాళీ అయిన విషయాన్ని శాసనసభ సచివాలయం వెంటనే ఎన్నికల ప్రధానాధికారికి తెలియజేయాలి. కానీ ఆ పని చేయలేదు. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన విషయాన్ని లోకసభ స్పీకర్ మీరా కుమార్ వెంటనే ఆ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలిపారు. కానీ 17 మంది విషయంలో మాత్రం శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ పని చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉప ఎన్నికలు మరింత ఆలస్యంగా జరగడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు.