బాబు కాదు: ఆ ముగ్గురూ నిలబడితేనే...
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు మరో ముగ్గురి పైన కూడా ఉందా? అంటే అవుననే అంటున్నారు. 2004 నుండి రెండు పర్యాయాలు అధికారానికి పార్టీ దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే ఆ పార్టీ మరికొన్నాళ్ల పాటు ఉంటుంది. లేదంటే కనుమరుగు కావడం ఖాయమనే అభిప్రాయం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర పేరుతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు.. తాము అధికారంలోకి వస్తే ఏం చేయగలమో, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో స్పష్టంగా, సవివరంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. బాబు తీరు ప్రజలను బాగానే ఆకట్టుకుంటుంది.
తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించడంతో ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే చర్చ ప్రారంభమైంది. ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా రాష్ట్రం మొత్తం తప్పకుండా ప్రభావం ఉంటుందని, ప్రత్యేకంగా చుట్టుపక్కల నియోజకవర్గాలు, జిల్లాలపై ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన బాలకృష్ణ సాధ్యమైనంత త్వరగా పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనాలని నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.
హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన మావయ్య చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తానని చెప్పడంతో టిడిపి క్యాడర్తో పాటు ఇతరుల్లో ఉన్నా అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాయి. ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రానని చెప్పిన జూనియర్.. ప్రచారం చేస్తే చాలని క్యాడర్ భావిస్తోంది. బాబాయికి ప్రచారం చేస్తానని, మావయ్య ముఖ్యమంత్రి అవుతాడని మరోసారి జూనియర్ నొక్కి చెప్పడంతో టిడిపిలో ఉత్సాహం పెరిగింది.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ఓ యువనేత ఉండాలని నేతలు పట్టుబట్టడంతో చంద్రబాబు తన తనయుడిని క్రమంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇటీవల లోకేష్ రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తల నుండి కూడా ఒత్తిడి పెరుగుతోంది. లోకేష్కు ప్రజల్లో మాస్ ఇమేజ్ లేదు. వైయస్ ఉన్నప్పుడు జగన్కు కూడా లేదు. కానీ ఆయన ప్రజల్లోకి రావడంతో ఇమేజ్ అమాంతం పెరిగింది. అలాగే లోకేష్ కూడా ప్రజల్లోకి వెళితే టిడిపి యువనేతగా ప్రజల మన్ననలు అందుకుంటారని అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టి పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. ఆయన 117 రోజుల పాదయాత్ర చేయనున్నారు. అవసరమైతే దీనిని పొడిగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పొడిగింపుపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బాబు ఒక్కరే పార్టీని గట్టెక్కించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.
ఆయనకు తోడుగా హీరోలు నందమూరి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధీటైన నేతగా పార్టీలో నానుతున్న నారా లోకేష్ కుమార్ కూడా పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకుంటేనే గెలుస్తుందని అంటున్నారు. వీరు ముగ్గురు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రచారంలో జోరుగా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం, ప్రజల్లోకి టిడిపిని తీసుకు వెళ్లాల్సిందే అని అంటున్నారు.