ఎన్టీఆర్ చిచ్చు: బాలయ్య, హరికృష్ణలది చెరోదారి?
బాలకృష్ణ ధోరణి హరికృష్ణకు నచ్చినట్లు లేదు. పురంధేశ్వరి అంటే హరికృష్ణకు చాలా ఇష్టమని చెబుతారు. ఆమెపై ఈగ వాలితే ఆయన మనసు సహించడానికి సిద్ధంగా ఉండదని అంటారు. ఆ స్థితిలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన జరగడమే ముఖ్యం గానీ క్రెడిట్ ఎవరికి దక్కాలనేది ముఖ్యం కాదనే వైఖరిని ప్రదర్శిస్తున్నట్లున్నారు. పైగా, పార్లమెంటులో విగ్రహ ప్రతిష్టాపన తమ బావలు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు గానీ, చంద్రబాబు నాయుడికి గానీ సంబంధించిన విషయం కాదని ఆయన నిక్కచ్చిగానే చెబుతున్నట్లు సమాచారం.
చంద్రబాబు, వెంకటేశ్వర రావు తమ తండ్రి ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారానికి దూరంగా ఉంటే తాము చూసుకుంటామనే ధోరణి హరికృష్ణలో కనిపిస్తోంది. ఎన్టీఆర్ కూతుళ్లు, కుమారులు 11 మంది సంతకాలు చేసి ఇస్తే ఏ విధమైన వివాదం ఉండదు. విగ్రహ ప్రతిష్టాపన జరిగిపోతుంది. కానీ, చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి, తనకూ దక్కాలని చూస్తున్నారు. అలాగే, కాంగ్రెసు పార్టీలో ఉన్న పురంధేశ్వరి ఆ క్రెడిట్ తనకే దక్కాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ రకంగా అది రెండు పార్టీల మధ్య వైరంగా మారి, రాజకీయ రంగు పులుముకుంది.
అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు పార్టీలతో సంబంధం లేదని కూడా హరికృష్ణ భావిస్తున్నారు. అందువల్ల అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కూడా కాదని ఆయన చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. ఆ రకంగా ఆయన చంద్రబాబును, బాలకృష్ణను వ్యతిరేకిస్తూ, కుటుంబ వ్యవహారంగానే, ఎన్టీఆర్ సంతానం వ్యవహారంగానే దాన్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో హరికృష్ణ ఉన్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతు ఇస్తున్న లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్యగా వివాదంలో తలదూర్చారు. ఆమె ఎంత వరకు వెళ్తారనేది ఇంకా తేలడం లేదు. ఎన్టీఆర్ తనయులో, కూతుళ్లో ఎవరో ఒకరు అడిగితే ఆమె సంతకం చేయడానికి సిద్ధంగానే ఉంటారని అంటున్నారు. అయితే, అందుకు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ముందుకు వస్తారా అనేది పెద్ద సమస్య.
నందమూరి కుటుంబ సభ్యులంతా కాకున్నా ఎన్టీఆర్ సంతానం కూర్చుని ఆలోచించుకుంటే పార్టీల ప్రమేయం లేకుండా ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంటులో వెలిసే అవకాశం ఉంటుంది.