పరకాల పోరు: విజయమ్మ వర్సెస్ విజయశాంతి

తమ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా ప్రచారం నిర్వహించటానికి వైయస్ విజయమ్మ ఈ నెల 8న పరకాల వస్తున్నారు. విజయమ్మ పరకాల వచ్చి ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టటానికి టీఆర్ఎస్ తమ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతిని తెరాస రంగంలోకి దించనున్నది. నిజానికి బుధ, గురువారాలలో విజయశాంతి పరకాలలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. విజయమ్మ రాక నేపథ్యంలో ఈ పర్యటనను గురు, శుక్రవారాలకు మార్చాలని తెరాస నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం.
తెలంగాణ రాములమ్మగా పేరు గడించిన విజయశాంతి దూకుడుకు వైయస్ విజయమ్మ తట్టుకోగలరా, తెలంగాణ విషయంలో సమర్థించుకోవడానికి వైయస్ విజయమ్మ వద్ద అసలు వాదన ఉందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ విషయంలో వైయస్ జగన్లాగే - తమ చేతుల్లో ఏమీ లేదని, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్తే సరిపోతుందా అనేది కూడా ప్రశ్నార్థకమే. బిజెపిపై విజయశాంతి దూకుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన మాతృ పార్టీ అనే విషయాన్ని కూడా లెక్క చేయకుండా విజయశాంతి బిజెపిపై ధ్వజమెత్తుతున్నారు.
ఇక, తెరాసకు మరోసారి గుణపాఠం నేర్పాలని సిద్ధపడిన బిజెపి లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ను రంగంలోకి దింపుతోంది. ఆమె శనివారం నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఒక జాతీయ పార్టీగా తాము చేస్తున్న కృషి గురించి, పార్లమెంటులో తమ పార్టీ చేసిన ప్రస్తావనలు, ప్రసంగాలను గురించి వోటర్లను చైతన్యవంతం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తారని ఆ వర్గాలు వివరించాయి.












Click it and Unblock the Notifications