రాజకీయాలు: పవన్ కళ్యాణ్ దారిలో జూ. ఎన్టీఆర్?
రాజకీయాల విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దారిలోనే జూనియర్ ఎన్టీఆర్ నడవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ విజయం కోసం ప్రచారం సాగించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసుకు దగ్గరవుతున్న క్రమంలో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఒకటి తర్వాత ఒకటి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. సినిమాలపైనే ఆయన పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తిగా మనసు లగ్నం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన వివాహం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దూరమయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో తెలుగుదేశం కోసం ఉత్తరాంధ్రలో చెమటోడ్చి ప్రచారం సాగించారు. ప్రచారం ముగించుకుని వస్తున్న క్రమంలోనే దారిలో ప్రమాదానికి గురయ్యారు.
చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంపై చూడాలన్న కోరిక, చిరంజీవిని ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చుండబెట్టాలనే పవన్ కళ్యాణ్ కలలగానే కరిగిపోయింది. ఈ స్తితిలోనే ఇద్దరు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతున్న క్రమంలో దానికి తన తండ్రి హరికృష్ణతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ అంతర్గత పోరాటం చేశారని అంటారు. లోకేష్ రాజకీయ రంగ ప్రవేశాన్ని చంద్రబాబు ప్రస్తుతానికి వాయిదా వేశారు. దీంతో తన ఉద్దేశం నెరవేరినట్లు జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తాను రాజకీయాల్లోకి రావడానికి అనువైన సమయం వచ్చే వరకు ఆగడం జూనియర్ ఎన్టీఆర్కు కష్టం కాదని అంటున్నారు. సినిమాల్లో తాను సాధించదలుచుకుంది సాధించిన తర్వాత రాజకీయాల గురించి ఆలోచించవచ్చుననే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
ఇప్పటి నుంచే రాజకీయాలకు సమయం కేటాయిస్తే సినీ కెరీర్పై ఆ ప్రభావం పడుతుందని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. అందువల్ల పూర్తి సమయం, ఆలోచన సినిమాలపైనే పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, సినీ రంగంలో యాంగర్కి పెట్టింది పేరైనా ఇద్దరు హీరోలు కూడా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుని తమకు నచ్చినట్లు వ్యవహరిస్తారనేది అర్థమవుతూనే ఉన్నది.