జైలులో జగన్, ముఖ్యమంత్రి రేసులో షర్మిల!?
వైయస్ జగన్ అరెస్టుకు ముందు అతను అరెస్టవుతాడంటూ పలుమార్లు ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు కారని చెప్పారు. పార్టీ వారే కాకుండా ఇతరులు కూడా జగన్ అరెస్టు జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేక పోయారు. అయితే మే 27వ తేదిన సిబిఐ జగన్ను అరెస్టు చేసి సంచలనం సృష్టించింది. అలాగే ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షుడికి తప్పకుండా బెయిల్ వస్తుందని ఆ పార్టీ నేతలు పిటిషన్ వేసినప్పుడల్లా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సుప్రీం కోర్టులో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పారు. కానీ జగన్కు చుక్కెదురయింది. అంతేకాకుండా మరో ఆరేడు నెలల వరకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది. దీంతో ఆ పార్టీలో ఒక్కసారిగా సైలెంట్ అయింది. అయితే సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి షర్మిలను మరో ప్రజా ప్రస్థానం పేరిట రంగంలోకి దించారు. జగన్కు బెయిల్ రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆమెచే పాదయాత్ర చేయించాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పారు.
జగన్ ఆస్తుల కేసు తీవ్రత దృష్ట్యా ఆయనకు బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు. సిబిఐకి సుప్రీం కోర్టు కేసు విచారణకు గడువు ఇచ్చింది. ఆ లోగా సిబిఐ మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టు ముందుంచితే జగన్కు బెయిల్ రాకపోవచ్చునని చెబుతున్నారు. అప్పుడు ఖచ్చితంగా షర్మిల పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోక తప్పదని చెబుతున్నారు. జగన్కు బెయిల్ రాని పక్షంలో షర్మిల 2014 ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాల్సి ఉంటుంది.
మధ్యంతర ఎన్నికలు వచ్చినా షర్మిలనే పార్టీని భుజానికెత్తుకోవాల్సి ఉంటుంది. జగన్ జైలులో ఉన్నందున ముఖ్యమంత్రి పీఠం షర్మిలను వరించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఆ పార్టీ కూడా షర్మిలకు ఓటు వేస్తుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెసు అధిష్టానం అవినీతికి పాల్పడిన సొంత పార్టీ నేతలు, తమతో పొత్తు పెట్టుకున్న నేతలను కూడా వదిలి పెట్టడం లేదు. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెసు తప్పని పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలు అయినా జైలుకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెసు, యూపిఏలోని కాంగ్రెసేతర నేతలు, మాజీ మంత్రులు పలువురు ఇప్పటికే జైలు బాట పట్టారు. యూపిఏ-2పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆ మచ్చను తొలగించుకునేందుకు కాంగ్రెసు అధిష్టానం వారిని జైలుకు పంపేందుకు వెనుకాడటం లేదు. ఆంధ్ర ప్రదేశ్లో కూడా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జైలులో ఉన్నారు. మరో ఐదుగురు మంత్రుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్కు కాంగ్రెసు చేయూత నిస్తుందని చెప్పలేమంటున్నారు.
ఎలా చూసినా జగన్కు కాంగ్రెసు అండదండలు ఉండవని చెబుతున్నారు. అయితే ఒకవేళ అంతగా కావాలంటే కేసు విచారణను స్లోగా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగైనా జగన్ బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. దీంతో జగన్ బయటకు వచ్చేలోగా ఎన్నికలు జరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తే జగన్ కల గన్న ముఖ్యమంత్రి పీఠంపై సోదరి షర్మిల కొంతకాలం కూర్చునే అవకాశం లేకపోలేదంటున్నారు!