టిడిపి 'బైబిల్' వ్యూహం: షర్మిలపై 'పర్సనల్' అటాక్

విజయమ్మ బైబిల్ వివాదం టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు మధ్య మాటల యుద్ధానికి తెర లేపింది. దీనిపై విజయమ్మ ఆదివారం వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ వివరణ పైనా టిడిపి తన అసంతృప్తి వ్యక్తం చేసింది. జగన్ పార్టీకి సవాళ్లు విసిరింది. అయితే తెలుగుదేశం వ్యూహాత్మకంగా జగన్ పార్టీపై అటాక్ చేస్తోందని అంటున్నారు. దాదాపు సంవత్సరంన్నరగా సీమాంధ్రలో జగన్ పార్టీ హవా కొనసాగుతోంది. అయితే అది కేవలం సెంటిమెంట్ కారణంగానే. ఉప ఎన్నికలలో గెలుపు కూడా ఆ సెంటిమెంట్ కారణంగానే.
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు వారిపై ఉన్న సెంటిమెంట్ను ప్రజల్లో తగ్గించేందుకు, తద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు జగన్ పార్టీ హవాను తగ్గించేందుకు టిడిపి వ్యూహాత్మకంగా బైబిల్ రాజకీయాలకు తెరలేపిందని అంటున్నారు. జగన్కు రెడ్లు, క్రైస్తవుల మద్దతు ఉంది. దీనిని గుర్తించిన తెలుగుదేశం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా వైయస్సార్ కాంగ్రెసుపై విమర్శల దాడికి దిగింది.
విజయమ్మ బైబిల్ పట్టుకొని రాజకీయం పేరుతో మత ప్రచారం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తితే హిందువుల ఓట్లు ఆ పార్టీకి ఖచ్చితంగా దూరమవుతాయి. ఇప్పటికే జగన్ పార్టీకి క్రైస్తవుల మద్దతు ఉందనే వాదన ఉంది. చర్చిలలో జగన్ కోసం ప్రార్థనలు చేసినట్లుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా జగన్ క్రైస్తవుల మద్దతుదారుడిగా పేరుబడితే ఆయన పార్టీకి ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో ధాటిగా విమర్శించినందుకు గాను హిందువులు టిడిపికి మద్దతు పలుకుతారు.
మరోవైపు అదే బైబిల్ పేరుతో క్రైస్తవులను కూడా తమ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. బైబిల్తో రాజకీయాలు చేయవద్దని చెప్పడం ద్వారా క్రైస్తవుల మద్దతూ టిడిపి పొందుతోందని చెబుతున్నారు. జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్మును పేద క్రైస్తవులకు పంచాలని, పవిత్రమైన బైబిల్ పట్టుకొని అపవిత్ర రాజకీయాలు చేయవద్దని టిడిపి సూచిస్తోంది. ఏసుక్రీస్తు పేరు చెప్పి అవినీతి సంపాదనకు తెగబడ్డారని విమర్శిస్తున్నారు. టిడిపి తన బైబిల్ వ్యాఖ్యలను వ్యూహాత్మకంగా చేస్తోందని, కేవలం ఆ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్గా చేసుకొని తద్వారా క్రైస్తవుల మన్ననలు కూడా పొందేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.
'పర్సనల్' అటాక్
తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసింది. గతంలో జగన్ వైఖరిని టిడిపి తప్పు పట్టింది. జగన్ను విజయమ్మ సక్రమంగా పెంచలేదని విమర్శించింది. తాజాగా మరింత దూకుడు పెంచింది. అన్న కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిల పైనా పర్సనల్ అటాక్కు దిగింది. షర్మిల భర్త ఎలా చనిపోయాడో చెప్పాలని, బ్రదర్ అనిల్ కుమార్ భార్యకు బలవంతంగా విడాకులు ఇప్పించలేదా చెప్పాలని టిడిపి నేత శోభా హైమావతి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications