మూడు కేసుల్లోనూ వైయస్ ఫ్యామిలీ?
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) నుంచి అక్రమ మైనింగ్ సంపాదన వైయస్ జగన్కు చెందిన సాక్షిలోకి ప్రవహించిందని ఈనాడు ఆరోపించింది. అలాగే, తాజాగా ఎమ్మార్ కుంభకోణంలోనూ వైయస్ కుటుంబ సభ్యులు సొమ్ము కాజేసినట్లు బయటపడిందని తెలిపింది. అధిక ధరలకు విల్లాలు విక్రయించిన సొమ్ములో 70 కోట్ల రూపాయలు వైయస్ జగన్ ఖాతాలోకి చేరాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని జగన్ సంస్థల్లోకి మళ్లించడంలో సునీల్ రెడ్డి కీలక పాత్ర పోషించడానేది ప్రధాన ఆరోపణ. ఎమ్మార్ విల్లా స్థలాల విక్రయం వల్ల సమకూరిన సొమ్ములో రూ. 70 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అందించానని, ఆ నిధులను సునీల్ రెడ్డి ద్వారా వారికి చేర్చానని కేసులో ఇప్పటికే అరెస్టయిన కోనేరు ప్రసాద్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ముడుపులు చెల్లించనవారికి మధ్య సునీల్ రెడ్డి సంధానకర్తగా వ్యవహరించినట్లు సమాచారమంటూ ఈనాడు దినపత్రిక రాసింది. అక్రమార్జనకు సంబంధించిన సొమ్మును జగన్ వరకు చేర్చే బాధ్యత సునీల్ రెడ్డిది కాగా, ఆ సొమ్మును వివిధ కంపెనీల ద్వారా వినియోగంలోకి తేవడం విజయ సాయి రెడ్డి పని అని చెబుతారంటూ వ్యాఖ్యానించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో విచారణ వేగం పెరిగిన తర్వాత సునీల్ రెడ్డి కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లాడని చెబుతారు.