వైయస్ భక్తి: కాంగ్రెసులో తప్పుతున్న బ్యాలెన్స్
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు మళ్లీ కాంగ్రెసు పార్టీలో చిచ్చుపెట్టినట్లే కనిపిస్తున్నారు. దీంతో కాంగ్రెసులో మళ్లీ బ్యాలెన్స్ తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మానియా నుంచి పార్టీ బయటపడాలని వి. హనుమంత రావు వంటి సీనియర్ నాయకులు పదే పదే చెబుతున్న తరుణంలో కెవిపి మాటలు ఒక్కసారిగా అగ్గిని రాజేశాయి. పిసిసి కార్యాలయం గాంధీభవన్లో వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం చేశారు. అంటే, వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల భక్తిని ప్రదర్శించాల్సిందేనని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారని చెప్పవచ్చు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మను తీసేయాలని వి. హనుమంత రావు ఇటీవల డిమాండ్ చేశారు. ఆయన గాంధీభవన్ వద్ద మౌనవ్రతం చేపట్టినప్పుడు చేసిన డిమాండ్లలో అది కూడా ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి భజన మానేస్తే తప్ప పార్టీ గాడిలో పడబోదనే వర్గం కాంగ్రెసులో బలంగానే ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు కాంగ్రెసు పార్టీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి నాయకులు అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని సొంతం చేసుకోవాలా, దూరం చేసుకోవాలా అనే వివాదం పార్టీలో చాలా కాలం సాగింది. ఆ వివాదం ముగిసిందని భావిస్తున్న తరుణంలో కెవిపి రామచందర్ రావు మళ్లీ దాన్ని తెర మీదికి తేవడంలోని ఆంతర్యమేమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. వైయస్ రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించాలని భావిస్తున్న కాంగ్రెసు నాయకుల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారున్నారు. అయితే, మంత్రుల్లో చాలా మంది వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా గానీ మద్దుతుగా గానీ మాట్లాడడం లేదు.
మంత్రివర్గంలో చాలా మంది ఇప్పటికీ వైయస్ భక్తులున్నారనేది ఓ అంచనా. గాంధీభవన్లో వైయస్ బొమ్మ లేదంటూ ఆవేశంగా కెవిపి రామచందర్ రావు మంగళవారం సాయంత్రం మాట్లాడినప్పుడు మంత్రి రఘువీరా రెడ్డి కంట తడి పెట్టారు. వైయస్ విజయమ్మకు వ్యతిరేకంగా పులివెందులలో ప్రచారం చేయడానికి మహిళా మంత్రులు నిరాకరించినట్లు అప్పుడే వార్తలు వచ్చాయి. వైయస్ జగన్ను ప్రత్యర్థిగా భావించి విమర్శలు చేయాలని ఒక వర్గం అంటుంటే, మంత్రివర్గంలోని చాలా మంది అందుకు అనుకూలంగా వ్యవహరించడం లేదు. మొత్తం మీద, మరోసారి కాంగ్రెసు పార్టీలో వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ చిచ్చు పెట్టింది.