వైయస్సార్ ఇష్యూ: కెవిపి వర్సెస్ విహెచ్
వైయస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా రాసుకున్న డైరీని పుస్తక రూపంలో ప్రచురించి, దాన్ని వైయస్ మూడోవర్ధంతి సందర్భంగా ఏపి భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ నెల 7న భారీస్థాయిలో ఆవిష్కరించేందుకు కెవిపి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ , వీరప్ప మొయిలీతో పాటు పలువురు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులను ఆయన ఆహ్వానించారు.
ఢిల్లీలో తనకున్న సంబంధాలను ఉపయోగించి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు వారు సుముఖత వ్యక్తం చేసేలా చూశారు. అంతేకాక, ఈ కార్యక్రమానికి తాను స్వయంగా రాలేకపోయినప్పటికీ అది దిగ్విజయం కావాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా కెవిపికి లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు రాష్ట్ర నేతలను, ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆయన ఆహ్వానించారు. వారితో పాటు వి.హనుమంతరావుకు కూడా ఆయన లేఖ రాశారు.
ఇదిలా వుంటే, 8న జూబ్లీహాలులో వి హనుమంతరావు ఒక భారీ భేటీకి తెరతీశారు. 1972 నుంచీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షులుగా, ఆఫీసు బేరర్లుగా, పనిచేసిన వారందరితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో చర్చించడమే ఈ సదస్సు ఉద్దేశం. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, ముకుల్వాస్నిక్లను ఈ సమావేశానికి రమ్మని కోరారు. ముఖ్యఅతిథిగా ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఆయన లేఖలు రాశారు.
పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరాకు హనుమంతరావు కెవిపిపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్లో ఉంటూ వైయస్ భజన చేస్తే ఏవరికి లాభిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేవిపి సతీమణి ఇడుపులపాయలో వైయస్ వర్ధంతి సభకు హాజరైన విషయాన్ని ఆయన వోరాకు చెప్పగా, ఈ విషయాన్ని ఆజాద్కు చెప్పాలని వోరా సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఆజాద్కు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
వైయస్ పాదయాత్రపై పుస్తకం విడుదల చేసి, సభను ఏర్పాటు చేస్తే ఎవరికి లాభం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఒక వైపు వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి కాంగ్రెస్ను తూర్పారపడుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం వైయస్ను ఆకాశానికెత్తుతూ భజన గీతాలు ఆలపించడం పార్టీకి ఉపయోగపడదని ఆయన అన్నారు.