కరుణించు సోనియమ్మా: సిఎంపై చిరంజీవి ఢీ
తాము కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి సోనియాతో అన్నట్లు సమాచారం. వీరు బుధవారం ఢిల్లీలో వేరు వేరుగా సోనియాను కలిశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడమే పార్టీకి పెద్ద సమస్య అని సోనియాకు చిరంజీవి వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరిని ఆయన తప్పు పట్టినట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో ఢీకొట్టడానికి చిరంజీవి సిద్ధమైనట్లు చెబుతున్నారు.
తన వర్గానికి చెందిన మంత్రి సి. రామచంద్రయ్యకు మద్దతుగా చిరంజీవి సోనియా వద్ద వాదించినట్లు తెులస్తోంది. రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, పార్టీని బలోపేతం చేయాలన్న యోచనలోనే అలా మాట్లాడారని చిరంజీవి వివరించినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ ఢిల్లీ పర్యటనలో సోనియా, రాహుల్ ఇద్దరినీ కలిశారు. రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై సమగ్ర నివేదికను సమర్పించారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర పరిస్థితిపై దృష్టి కేంద్రీకరిస్తామని, అంతవరకూ మరే చర్యలు ఉండవని అధిష్ఠానం రాష్ట్ర నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పట్టుబట్టినందువల్లనే డిఎల్ రవీంద్రారెడ్డిపై చర్యకు అంగీకరించామని, అంత మాత్రాన తాము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు కాదని ఢిల్లీ పెద్దలు తమను కలిసిన నేతలకు చెబుతున్నట్లు తెలిసింది.
తెలంగాణపై అధిష్ఠానం సీరియస్గా ఆలోచిస్తోందని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం ప్రకటించే వీలుందని ఢిల్లీలో మకాం వేసిన ఒక ముఖ్యనేత వివరించారు. ఈ విషయంలో కిరణ్ తన వైఖరిని స్పష్టం చేశారని అంటున్నారు. ఛత్తీస్గఢ్ దాడిని ఉటంకిస్తూ మావోయిస్టులు పెరిగిపోయే అవకాశం ఉందని కిరణ్ వివరించినట్లుగా చెబుతున్నారు. కాగా, బుధవారం సాయంత్రం డిప్యూటీ సీఎం రాజనరసింహ కూడా ఢిల్లీ వచ్చారు. ఆయనతో అధిష్టానం పెద్దలు ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.