బొత్స టార్గెట్ తెలంగాణనా, వైయస్ జగనా?
బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారనేది రహస్యమైన విషయమేమీ కాదు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే, ప్రస్తుత తరుణంలో బొత్స సత్యనారాయణ వ్యూహం అదేనా అనే విషంయలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణను ఆయన లక్ష్యం చేసుకున్నారా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను టార్గెట్ చేసుకున్నారా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం అనుకూల సంకేతాలను ఇస్తోంది. ఇటీవల ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో చెప్పిన విషయాలు గానీ, కేంద్ర మంత్రి వాయలార్ రవి చేసిన ప్రకటన గానీ తెలంగాణకు అనుకూలంగానే అధిష్టానం ఉందనే సంకేతాలు ఇచ్చాయి. తెలంగాణపై ప్రకటన వెలువడే సమయంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు చక్రం తిప్పి నిలిపేయించారనే ప్రచారం కూడా ఉంది. ఈ సమయంలోనే రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై తాను సమైక్యాంధ్రవైపు ఉన్న సంకేతాలను బొత్స ఇచ్చారు.
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సమైక్యవాదానికి ఆయన మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీలో అంతర్గత కలహాలను సృష్టించడానికి బొత్స ప్రయత్నాలు సాగిస్తున్నారా అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ల ఆమోదం తర్వాత తెలంగాణపై ప్రకటన చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశాల లోగానే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టాలనే ప్రయత్నంలో బొత్స ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల పట్ల కఠినంగా ఉండాలనే ఉద్దేశంతోనే తొమ్మిది మందిపై వేటు వేశారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. వైయస్ జగన్ వైపు ఉంటూ కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్న శాసనసభ్యులకు ఇది హెచ్చరికగా పనిచేస్తుందని బొత్స భావించారా, తెలియదు. మొత్తంగా, తొమ్మిదిపై వేటు విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బొత్స తెలిపారా అనేది కూడా సందేహంగానే ఉంది. పార్టీ అధిష్టానం సూచన మేరకే బొత్స ప్రకటన చేశారా, లేదంటే వ్యక్తిగత వ్యూహరచనతోనే చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది.