చిరంజీవి రాకెట్ స్పీడ్: రేసులో పట్టు కోసమేనా!?

Chiranjeevi
సినిమాల్లో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి విఫలమయ్యారనే చెప్పవచ్చు. అయితే, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా మాత్రం ఆయన విజయం సాధిస్తున్నారు. సినిమాల్లోలా పర్యాటకంలో సూపర్ హిట్ అవుతున్నారు. న్యూఢిల్లీలోని చిరంజీవి పర్యాటక శాఖ కార్యాలయం నిత్యం కళకళలాడుతోంది. ఇప్పుడు పర్యాటక శాఖ, ఆ శాఖ మంత్రి చిరంజీవి దాదాపు అందరికీ తెలుసు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చిరంజీవి నెలల సమయంలోనే భళా అనిపించుకున్నారు.

చిరంజీవి పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బిజీ బిజీగా మారారు. భారత్‌కు పర్యాటకులను పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ఆయన విదేశాలను చుట్టి వస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలు చుట్టి వచ్చారు. అక్కడి పర్యాటక స్థలాల పరిరక్షణను పరిశీలించి ఇక్కడ అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందిన చిరు బాలీవుడ్‌లోను పలు చిత్రాల్లో నటించారు.

ఆయనకు దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉంది. దీనికి తోడు ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తన కార్యాలయానికి దాదాపు ప్రతిరోజు హాజరవుతున్నారు. తన శాఖ ద్వారా దేశానికి, సొంత రాష్ట్రానికి ఏం చేయవచ్చునో ఆరా తీయడంతో ఫైళ్ల దుమ్ము వదలడం మొదలైంది. రాష్ట్రం నుంచి ప్రతిపాదన రావాలన్న విషయాన్నే పట్టించుకోకుండా తానే ప్రతిపాదనలను తెప్పించి నిధులు మంజూరు చేస్తున్నారట.

పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన వెంటనే అవి అమలయ్యేలా చూడడమే కాక, వారు మళ్లీ కనపడినప్పుడు తానేం చేశానో చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చిరంజీవి వేగం చూసి ఆయన వద్దకు వచ్చి షోలాపూర్‌లో పర్యాటక స్థలాలకు నిధులు మంజూరు చేయించుకున్నారు. ఇంతకొద్ది సమయంలో ఇన్ని వందల కోట్లు మంజూరు చేసిన మంత్రి మరొకరు లేరట. మన రాష్ట్రం విషయానికి వస్తే.. ఆయన ఓ విజన్ ఏర్పర్చుకున్నారు.

పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్రాలకు ఇచ్చే అవార్డుల్లో ఏడింటిని మన రాష్ట్రానికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఇప్పించారు. ఇందులో పర్యాటక రంగం సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్‌కే అవార్డు లభించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ రప్పించి తన మంత్రిత్వ శాఖకు చెందిన తొమ్మిది మంది అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్తు ప్రాజెక్టుల జాబితాను రూపొందించారు.

చిరు రైల్వే మంత్రి అయితే రాష్ట్రానికి పంట పండేదని ఓ నేత అన్నారట. యమ స్పీడుగా పని చేస్తూ పోవడం చిరు స్టైల్ అంటున్నారు. రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో చిరు ఇప్పుడు పడ్డారు. ఇప్పటికే రాష్ట్రానికి చిరు పలు ప్రాజెక్టులను ఖరారు చేశారు. అయినా ఎటువంటి ప్రాంతీయ వివక్ష లేకుండా పలు రాష్ట్ర ప్రాజెక్టులను ఆమోదించి, నిధులు మంజూరు చేస్తున్న తీరు చూస్తే చిరంజీవికి ఏమైనా రాజకీయ లక్ష్యాలున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఉన్నారనే విషయం బహిరంగ రహస్యమే. ఈ శాఖ ద్వారా రాష్ట్రంలో తన పట్టు పెంచుకొని తద్వారా ఎన్నికల్లో రేసులో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+