కావాలనే..: బాబు మాస్టర్ ప్లాన్పై ఎన్టీఆర్ ఆందోళన!
ఈ రోజు ఎన్టీఆర్ వ్యాఖ్యలతో కొత్త చర్చ ప్రారంభమైంది. తనకు ఆహ్వానమే అందలేదని, ఈ రోజు ఆహ్వానం అందినా వెళ్తానని, పార్టీ అదేశిస్తే వచ్చే ఎన్నికలలో ప్రచారం చేస్తానని జూనియర్ చెప్పారు. అంటే చంద్రబాబే కావాలని పక్కన పెట్టారా? అనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. మహానాడులో ఇప్పుడు నారా లోకేష్ స్టార్ అట్రాక్షన్ అయ్యారు. సోమవారం లోకేష్ హడావుడి స్పష్టంగా కనిపించింది. ఈ రోజు ఆయన వేదిక పైనుండి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి.
లోకేష్ కోసమే పిలువలేదా?
లోకేష్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు లోకేష్ పైన పార్టీ ఓ ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికే అసంతృప్తితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ను పిలిస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో పిలువలేదా అనే చర్చ సాగుతోంది.
మరోవైపు టిడిపి మాత్రం బాలకృష్ణ, లోకేష్లకు కూడా ఆహ్వానం అందించలేదని చెబుతోంది. ఎన్టీఆర్ కుటుంబానికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వారు ఎప్పుడైనా, ఎక్కడికైనా పార్టీ కార్యక్రమాలకు రావొచ్చునని చెప్పారు. అయితే తనకు ఆహ్వానం అందలేదని జూనియర్, పంపించామని టిడిపి చెప్పడం ద్వారా కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు.
తెలుగు తమ్ముళ్లు మాత్రం పైస్థాయిలో ఆహ్వానం ఎలా ఉంటుందో తమకు తెలియదని, ఇవి విభేదాలుగా తాము భావించడం లేదని, ఏదో మిస్ అండర్స్టాండింగ్ అయి ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ స్పష్టంగా టిడిపి కోసం పని చేస్తానని చెప్పడం తమకు సంతోషం కలిగిస్తోందని చెప్పారు.
జూనియర్, హరి ఆవేదన
టిడిపికే అండగా నిలబడతామని హరి, జూనియర్లు స్పష్టంగా చెప్పినప్పటికీ వారిలో ఆవేదన, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. లోకేష్ టిడిపిలో క్రియాశీలకం అయితే జూనియర్కు భవిష్యత్తులో ఆ పార్టీలో సముచిత స్థానం ఉండదనే ఆందోళన వారిలో ఉందని అంటున్నారు.