గద్దెతో మంతనాలు: హరికృష్ణ ఎగదోస్తున్నారా?
ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన పార్టీ మహానాడుకు హరికృష్ణ తొలి రోజు వచ్చారు. అయితే, చురుగ్గా వ్యవహరించలేదు. పార్టీ కండువా వేసుకోవడానికి కూడా నిరాకరించారు. రెండో రోజు పూర్తిగానే దూరంగా ఉన్నారు. పార్టీకి దూరమవుతూ వస్తున్న హరికృష్ణతో హోటల్ గదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ పార్లమెంటు సబ్యుడు గద్దె రామ్మోహన్ సుదీర్ఘ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి.
బుధవారం నాడు విజయవాడకు వచ్చిన హరికృష్ణను మిగిలిన నాయకులు కూడా మర్యాదపూర్వకంగా కలిసినా, రామ్మోహన్ మాత్రం ఏకంగా దాదాపు రెండు గంటలు గదిలో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండిపోయారు. కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు నాయుడుకేశినేని నానికి అప్పగించారు. దీంతో నొచ్చుకున్న గద్దె పశ్చిమగోదావరి పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు వద్దకు వెళ్లారు. న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పడంతో పార్టీకోసం పనిచేస్తానంటూ బహిరంగంగా చెప్పారు. తర్వాత మళ్లీ విజయవాడ లోక్సభ టికెట్ తనకే కావాలని పట్టుబట్టారు.
చంద్రబాబు వారించడంతో గద్దె రామ్మోహన్ నెమ్మదించినా, బుధవారం ఓ స్టార్ హోటల్లో హరికృష్ణతో సుదీర్ఘంగా భేటీ కావడం చర్చకు దారి తీస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరులు కూడా హరి వద్దకు వెళ్లినా, ఒకటి రెండు నిమిషాలు మర్యాదపూర్వకంగా కలిసి వచ్చేశారు. అయితే గద్దె మాత్రం 105 నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉన్నారు. దీన్ని పార్టీ అధిష్ఠానం కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
హరికృష్ణ వర్గానికి చెందిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయారు. వల్లభనేని వంశీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒక వర్గాన్ని దూరం చేస్తున్న చంద్రబాబుతో హరికృష్ణ కయ్యానికి కాలు దువ్వుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.