తెలంగాణ: ఐదేళ్ల పాటు యుటిగా హైదరాబాద్?
రాష్ట్ర విభజనకు యుపిఎ సమన్వయ కమిటీ, కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) అంగీకరించిన తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా, రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలా అనే విషయంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సీమాంధ్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా పిలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాలలో కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కాంగ్రెసు తెలంగాణ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా దానికి వ్యతిరేకంగా ఉంది. రాయలసీమకు చెందిన అన్ని పార్టీల నాయకులు దానికి అంత సముఖంగా లేరు. దానికి తోడు, బిజెపి అందుకు అంగీకరించే అవకాశం లేదు. దీంతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉంది.
కిరణ్ రెడ్డి రాజీనామాతో మారిన వ్యూహం
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా లేఖను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే సమర్పించారని అంటున్నారు. దీంతో కాంగ్రెసు అధిష్టానం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోది. దీంతో రాష్ట్రపతి పాలన అనివార్యం కావచ్చునని చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగే వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంటుంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువు తీరుతాయి.
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో అప్పటికప్పుడు ఆందోళనలు అనూహ్యంగా తలెత్తే అవకాశాలు లేవని, కొన్ని శక్తులు వెనక ఉండి నడిపిస్తే మాత్రం ఆందోళనలు ఉంటాయని కాంగ్రెసు అధిష్టానం అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభించినట్లు చెబుతున్నారు.