కోటాలో ఛాన్స్కోసం కొట్లాట!: బరిలో కొండా సురేఖ?
తమకు ఉన్న ఎమ్మెల్యేలతో పాటు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమైన టిడిపి, కాంగ్రెసు ఎమ్మెల్యేలే కాకుండా మరికొందరిని కలుపుకొని ఒకరిని గట్టెక్కించవచ్చుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. మొదటి ప్రాధాన్యం కొండా దంపతులకు ఇవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, కొండా సురేఖ కంటే కొండా మురళికి ఇచ్చేందుకే ఇటు పార్టీ, అటు సురేఖ కూడా ఆసక్తి చూపించే అవకాశముంది. రెండో అభ్యర్థిపై తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. అలా అయితే, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని భావిస్తున్నారట. జగన్ పార్టీకి మజ్లిస్ మద్దతిచ్చే అవకాశముంది.
మరోవైపు ఎమ్మెల్సీల బరిలో దిగిందుకు కొత్తవారు, మరోసారి అవకాశం దక్కించుకునేందుకు పాతవారు ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా, గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలలో కొందరి పదవీ కాలం త్వరలో ముగుస్తోంది. మొత్తం 24 మంది పదవీ కాలం పూర్తి కానుంది. దాదాపు వీరంతా రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారట.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఫార్సుతో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైనవారిలో పదిమంది రిటైర్ అవుతున్నారు. వీరిలో కాంగ్రెసు వారు ఐదుగురు. అందులో నలుగురు తెలంగాణ నేతలు (ఇంద్రసేన్ రెడ్డి, భారతి ధిరావత్, పొంగులేటి సుధాకర్రెడ్డి, పుల్లా పద్మవతి). ఒకరు కోస్తాంధ్రకు (కందుల లక్ష్మీ దుర్గేశ్) చెందినవారు. వారు రెన్యూవల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట.
స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికైన పది మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురిలో ఐదుగురు మరో ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటా కింద కోరే వారు కూడా ఉన్నారు. గవర్నర్ కోటా నుంచి రిటైర్ అవుతున్న పివి రంగారావును రెన్యువల్ చేయడంపై ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు.