దెబ్బకు దెబ్బ: జగన్ ఎమ్మెల్యేల వేటుపై తిరకాసు

YS Jagan
రెండు రోజుల క్రితం జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలో అధికార కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమయం, సందర్భం చూసి వారిపై వేటు వేసేందుకు సన్నద్ధమవుతోంది.

వేటు వేసినా మళ్లీ ఉప ఎన్నికలు రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సిద్ధమవుతున్న కాంగ్రెసు అందుకు మరికొద్ది రోజులు సమయం తీసుకోవాలని భావిస్తోందట. ఇప్పటికిప్పుడు వేటేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంది. అదే జూన్ తర్వాత వేటు వేస్తే ఉప ఎన్నికలు రావు. ఆ ఖాళీలకు సాధారణ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరుగుతాయి. ఈ అస్త్రాన్ని ఇప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపయోగించుకునేలా కనిపిస్తోంది.

ఇలా వేటు వేయగానే అలా ఉప ఎన్నికలు వస్తాయని, రాష్ట్రమంతా వేడి పుడుతుందని, బంపర్ మెజారిటీతో గెలిచి మళ్లీ సభలో అడుగుపెట్టాలని జగన్ పార్టీ భావించింది. కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా అంటే దాదాపు ఏడాది వారు మాజీలుగానే ఉండిపోయేలా కాంగ్రెస్ జాప్యం వ్యూహం రచిస్తోంది. శనివారం శాసన మండలిలోని సిఎం కార్యాలయంలో కిరణ్, బొత్స సమావేశమై, కట్టుదాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసే అంశంపై చర్చించారు. దీనిపై 20న కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు.

సిఎల్పీ అభిప్రాయం తీసుకుని, ఆ తీర్మానం మేరకు 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తారు. వాస్తవానికి విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ 15 రోజుల్లోగా స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలి. కానీ, జగన్ వర్గంపై వ్యూహాత్మకంగా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వాన్ని కీలక సమయంలో దెబ్బతీసి ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ప్రయత్నించిన వారు దానికి తగిన మూల్యం చెల్లించేలా వ్యూహరచనకు దిగుతోంది.

ఇందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 151ఎ (ఎ)ను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. దీని ప్రకారం ఏడాదిలోగా సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంటే, ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీలులేదు. గతంలో తెరాస ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సమయంలో సాధారణ ఎన్నికలకు 13 నెలల 15 రోజులు గడువు ఉన్నందునే ఉపఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కన్పించడం లేదు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఏడాది జూన్ 3న తొలిసారిగా అసెంబ్లీలో కొలువు తీరింది. అంటే 2014 జూన్ 2వ తేదీ వరకూ ప్రభుత్వానికి గడువుంది.

ఈ ఏడాది జూన్ రెండో తేదీ తర్వాత జగన్ వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడితే 2014 సార్వత్రిక ఎన్నికల వరకూ ఇక ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. అప్పటి వరకూ జగన్ వర్గ ఎమ్మెల్యేలు 9 మంది మాజీలుగానే మిగిలిపోతారు. అయితే ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ 15 రోజుల్లోగా అంటే నెలాఖరులోగా స్పీకర్‌కు సిఎల్పీ నోటీసు ఇచ్చిన వెంటనే వారిపై వేటు పడదు. వారి వివరణను స్పీకర్ స్వీకరిస్తారు. తర్వాత వారి వాదనలు వ్యక్తిగతంగా సిఎల్పీ ప్రతినిధి సమక్షంలో వింటారు. ఈ సమయంలో సిఎల్పీ వాదనలు కూడా స్పీకర్ వింటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలలు పడుతుంది. ఏప్రిల్, మేనెలలు గడచి పోతాయి. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో జగన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఇక ఉప ఎన్నికలకు ఆస్కారమే లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+