విహెచ్ వ్యాఖ్య: టిడిపి పూలు, జగన్ పార్టీ రాళ్లు!
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావే తిరుమలలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, అందుకు మొదట ఆయనను అరెస్టు చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం తిరుపతిలో విహెచ్ కారు పైన రాళ్లు, గుడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిని నిరసిస్తూ సమైక్యవాదులు ఆదివారం సీమాంధ్ర బందుకు పిలుపునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విహెచ్ ఏమన్నారు?
విహెచ్ తిరుమలలో మాట్లాడుతూ... ఉద్యోగుల ఆందోళన వెనుక నాయకులు ఉన్నారని, నిబంధనలుకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాదులో ఉండవచ్చునని, విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే ఆద్యుడని, అలాంటప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్ష ఎలా చేస్తారని, అది మోసపూరితమే అన్నారు. దీనిపై సమైక్యవాదులు మండిపడ్డారు. ఆయన కారు పైన దాడి చేశారు.
ఏం జరిగింది?
విహెచ్ తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న విషయం తెలుసుకున్న సమైక్య ఉద్యమకారులు అలిపిరి వద్ద శాంతియుత పద్ధతిలో నిరసన తెలియచేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. విహెచ్కు పుష్పగుచ్ఛాలు ఇస్తామని చెప్పడంతో పోలీసులు అందుకు అనుమతించారు. పూలు స్వీకరిస్తానని విహెచ్ కూడా తిరుమలలో చెప్పారు. అయితే తిరుపతికి బయలుదేరే ముందు ఆయన చేసిన వ్యాఖ్యలతో వాతావరణం మారిపోయింది.
అలిపిరి వద్ద సమైక్యవాదుల నుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశముందని పోలీసులు గ్రహించి విహెచ్ కుటుంబ సభ్యులను వేరే వాహనంలో బందోబస్తుతో తిరుపతి విమానాశ్రయానికి చేర్చారు. ఆ తర్వాత విహెచ్ను పోలీసు కాన్వాయ్ మధ్య తిరుపతికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ఆయన వాహనం అలిపిరి వద్దకు చేరుకోగానే సమైక్యవాదులు చుట్టుముట్టారు.
తొలుత కారు వద్దకు వచ్చిన పలువురి నుంచి విహెచ్ పూలు స్వీకరించారు. 'జై సమైక్యాంధ్ర' అనాలని కొందరు డిమాండ్ చేయగా విహెచ్ నవ్వి ఊరుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్పై స్పందించలేదు. ఇంతలో పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు వాహనం వద్దకు తోసుకురావడంతో విహెచ్ కారు కిటికీ అద్దాలు మూసేశారు. దీంతో ఆందోళనకారులు కారును చుట్టుముట్టారు.
కొందరు వాహనంపైకి చెప్పులు విసిరేశారు. ఇంకొందరు వాహనం ముందు రోడ్డుపై పడుకున్నారు. ఒక వ్యక్తి రాయితో కొట్టడంతో వాహనం పక్క అద్దం పగిలిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గమనించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. అందరినీ చెదరగొట్టి విహెచ్ను భద్రంగా రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు.
కాగా, పవిత్రమైన ప్రదేశానికి వచ్చిన విహెచ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమేమిటని సమైక్యవాదులు ప్రశ్నించారు. విహెచ్ కారు పైన ఎవరు దాడి చేయలేదని, ఆయన వ్యాఖ్యలను నిరసిస్తు అడ్డుకున్నామన్నారు. ఒకవేళ నిజంగానే దాడి జరిగితే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విహెచ్ను మొదట అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు తెలంగాణ నాయకులు, ప్రజలు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకొని వెళ్లారని, వారిని అడ్డుకోకుండా తాము విహెచ్నే ఎందుకు అడ్డుకున్నామని ప్రశ్నించారు.
మంత్రులు జానా రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులతో పాటు నాయకులు, భక్తులు వచ్చారని, వారిని తాము ఏమీ అనలేదన్నారు. తిరుమలకు వచ్చిన విహెచ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినందు వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తున్నారు. తాము దాదాపు ఇరవై రోజులుగా శాంతియుతంగా ఉద్యమిస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే, ఉద్యమం శాంతియుతంగా జరుగుతుంటే దాడులు ఎందుకు జరుగుతున్నాయని, విహెచ్ కంటే ముందు కూడా ఇలాంటివి తెలంగాణ ఉద్యోగుల పైన సీమాంధ్రలో జరిగాయని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు.
కాగా, తన పైన దాడి చేసింది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారేనని విహెచ్ ఆరోపించారు. తనను తెలుగుదేశం పార్టీ వారు అడ్డుకొని పూలు ఇచ్చారని, సమైక్యానికి అనుకూలంగా ఉండాలని కోరారని, దానికి తాను అధిష్టానం దృష్టికి మీ విజ్ఞప్తిని తీసుకు వెళ్తానని చెప్పానని, అంతలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు వచ్చే వారెవరైనాసరే తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేయొద్దని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబు విజ్ఞప్తి చేశారు. తిరుమలకు వచ్చే విఐపిలకు భద్రత కల్పిస్తామని, అలాగే ఇక్కడకు వచ్చే నాయకులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
విహెచ్కు జడ్ కేటగిరీకి కంటే ఎక్కువ భద్రత కల్పించామన్నారు. ఆయన భద్రత కోసం ఇద్దరు ఎస్ఐలతోపాటు ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయించామన్నారు. ఉద్యమాలు శాంతియుతంగా చేయాలని, ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. విహెచ్ వాహనంపై దాడిచేసిన వారిపై ఐపీసీ 147, 427, 341, 353, 355, 322 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.