తెలంగాణపై సమైక్యం పైచేయి: కెవిపి చక్రం!
ఈ వ్యూహం వెనుక రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఉన్నారట. కెవిపి ఎప్పుడూ తెరవెనుక ఉంటూ తన చతురతతో వ్యూహాలు రచిస్తుంటారు. కానీ ఇప్పుడు సీమాంధ్ర నేతలతో పాటు అతను కూడా గళమెత్తారు. అయితే దాని వెనుక వ్యూహం మాత్రం ఆయనదేనట. సోమవారం ఢిల్లీలో సీమాంధ్ర నేతలు బలంగా తమ సమైక్యవాదాన్ని వినిపించారు. వారు వాయలార్ రవి, దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే తదితరులను కలిశారు.
ఈ సందర్భంగా షిండే... ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఉంది కదా అని చెప్పారు. అయితే రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పలేదని షిండే దృష్టికి తీసుకు వచ్చారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనను, ఎన్నికల ప్రణాళికను వారు అందజేశారు. అయితే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తే చాలని సూచించారు. సీమాంధ్ర బలమైన వాదనను విన్న షిండే గతంలో ఇంత బలంగా ఎందుకు వాదించలేదని వారిని అడిగారు. అయితే విభజన జరగదన్న భావనతోనే తాము ఉన్నామని వారు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.
షిండేతో సమావేశమైనప్పుడు కెవిపి పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ఇస్తామని ఎన్నికల హామీ పత్రంలో చెప్పని విషయాన్ని, అసెంబ్లీలో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారా అని షిండే అడిగితే.. 2009 ఫిబ్రవరి 12న శాసనసభలో వైయస్ చేసిన ప్రసంగం కాపీని ఇచ్చారు. కెవిపి వ్యూహం మేరకు పూర్తిస్థాయిలో సీమాంధ్ర నేతలు సంసిద్దులై వెళ్లారట. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదేసేందుకు వీల్లేదంటూ కెవిపి గట్టిగా వాదించారు.
అంతేకాకుండా 1956 నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను కూడా వారు ఏకరువు పెట్టారట. 2009 తెలంగాణపై ప్రకటనకు ముందు, తర్వాత తెలంగాణలోని పరిస్థితులను కూడా వారు వివరించినట్లుగా తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయం షిండే దృష్టికి తీసుకు వచ్చారు. సీమాంధ్ర నేతలు విడివిడిగా వెళితే దాడురు ఎదురవుతాయని భావించిన కెవిపి అందరినీ ఒకేసారి మూకుమ్మడిగా తీసుకెళ్లే వ్యూహానికి తెరలేపారట. ఢిల్లీలో సీమాంధ్ర నేతల పర్యటనపై కెవిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.
కెవిపి చొరవ కారణంగానే 15 మంది మంత్రులు, 48 మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి చేరుకున్నారని తెలుస్తోంది. మంగళవారం మరికొందరు మంత్రులు ఢిల్లీకి చేరుకుంటారు. కాగా తెలంగాణపై ఇంకా అంచనాకు రాలేదని, సుశీల్ కుమార్ షిండే మనసులో ఏముందో ఇప్పుడే చెప్పలేమని వాయలార్ రవి సీమాంధ్ర నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. తొందరపాటు చర్యలు ఉండవని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఢిల్లీ పెద్దలు వారికి హామీ ఇచ్చారట.